30 కంపెనీలు.. 31,277 కోట్లు
ABN , First Publish Date - 2021-03-29T07:11:46+05:30 IST
పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్ జోరందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇప్పటి వరకు 30 కంపెనీలు.. ఐపీఓల ద్వారా ఏకంగా రూ.31,277 కోట్లు సమీకరించాయి...
- జోరు మీదున్న ఐపీఓ మార్కెట్
న్యూఢిల్లీ : పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) మార్కెట్ జోరందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇప్పటి వరకు 30 కంపెనీలు.. ఐపీఓల ద్వారా ఏకంగా రూ.31,277 కోట్లు సమీకరించాయి. గత మూడేళ్ల కాలానికి చూస్తే ఇదే అతి పెద్ద మొత్తం. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్లాండ్ ఫార్మా ఒక్కటే రూ.6,480 కోట్లు సమీకరించింది. రూ.4,633 కోట్లతో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎ్ఫసీ), రూ.2,240 కోట్లతో సీఏఎంఎస్, రూ.2,160 కోట్లతో యూటీఐ ఏఎంసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
50శాతం ఎక్కువ : 2020 మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంతో చూసినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు.. ఐపీఓ మార్కెట్ ద్వారా సమీకరించిన మొత్తం దాదాపు 50 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 13 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.20,352 కోట్లు మాత్రమే సమీకరించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండడం, ఎఫ్పీఐల పెట్టుబడుల వరద, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాల అంచనా. ఐపీఓలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో యస్ బ్యాంక్.. ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించింది.
త్వరలో మరిన్ని ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ జోరందుకోవడంతో మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.28,710 కోట్లు సమీకరించేందుకు 28 కంపెనీలు ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేశాయి. ఇవి కాకుండా రూ.లక్ష కోట్ల ఎల్ఐసీ మెగా ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో మార్కెట్కు రానుంది.