పరిహారం ఇవ్వకుండా వేధించడం సమంజసమా?

ABN , First Publish Date - 2021-10-12T04:45:06+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించే అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చిన నిర్వాసితులకు అధికారులు పూర్తి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో బాధితుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. సోమవారం తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామం వద్ద భూనిర్వాసితులు కాలువ పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.

పరిహారం ఇవ్వకుండా వేధించడం సమంజసమా?
తొగుట మండలం తుక్కాపూర్‌లో కాలువ పనులను అడ్డుకుంటున్న భూనిర్వాసితులు




మల్లన్నసాగర్‌ అదనపు టీఎంసీ కాలువ పనులను అడ్డుకున్న రైతులు


తొగుట, అక్టోబరు 11 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించే అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చిన నిర్వాసితులకు అధికారులు పూర్తి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో బాధితుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. సోమవారం తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామం వద్ద భూనిర్వాసితులు కాలువ పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నమ్ముకున్న భూమినిచ్చి త్యాగాలు చేసిన తమకు నష్టపరిహారం ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా గ్రామంలో అదనపు టీఎంసీ కాలువ కోసం 49 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి ఎకరాకు రూ.13 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా మొదటి విడతగా భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.8 లక్షలను చెల్లించారు. మిగతా రూ.5 లక్షలను మూడు నెలల్లో చెల్లిస్తామని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పరిహారం విషయాన్ని అధికారులు దాటవేస్తుండటంతో నిర్వాసితులు మండిపడుతున్నారు. కాలువ పనులను అడ్డుకుని తమకు పూర్తి పరిహారం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మొదటి విడతగా వచ్చిన డబ్బుతో వేరే దగ్గర భూములు కొన్నామని వాటికి డబ్బు కట్టకపోతే ఇచ్చినవి పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం తమ వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. తమకు రావాల్సిన పరిహారం ఇచ్చేవరకు అదనపు టీఎంసీ పనులను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. కాగా నిర్వాసితులు కాలువ పనులను అడ్డుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. రెండో విడతగా త్వరలోనే రూ.3లక్షలు రైతులకు చెల్లించేలా చూస్తామని, మిగతా డబ్బు కోర్టు ద్వారా తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక్కడ ఎలాంటి ఆందోళనలు చేసినా ఊరుకోబోమని చెప్పి అక్కడి నుంచి రైతులను పోలీసులు బలవంతంగా తరలించారు.



Updated Date - 2021-10-12T04:45:06+05:30 IST