‘శిక్షా అభియాన్‌’లో సమన్వయమేదీ?

ABN , First Publish Date - 2020-09-11T06:13:46+05:30 IST

‘సర్వశిక్షా అభియాన్‌’ పేరును ‘సమగ్ర శిక్షా అభియాన్‌’గా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కమిటీని నియమించింది. ఎవరు, ఎలా ఎన్నిక చేసారో...

‘శిక్షా అభియాన్‌’లో సమన్వయమేదీ?

‘సర్వశిక్షా అభియాన్‌’ పేరును ‘సమగ్ర శిక్షా అభియాన్‌’గా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కమిటీని నియమించింది. ఎవరు, ఎలా ఎన్నిక చేసారో తెలియదుగాని రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఔత్సాహిక ఉపాధ్యాయులు, రచయితలు, కవులతో కూడిన 157 మంది సభ్యులను ఎంపిక చేసి వారి జాబితాను ఫోను నెంబర్లతో సహా ప్రకటించారు. చాలామంది సభ్యులకు తాము ఎంపికైన విషయం తెలియనే తెలియదు. ప్రభుత్వ శాఖ నుండి గాని, జిల్లా కమిటీలకు ఎంపికైన కోఆర్డినేటర్ల ద్వారాగాని వారికి ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని జిల్లాల్లో జిల్లాకు ఇద్దరు చొప్పున సమన్వయకర్తలను ఎంపిక చేసినట్లు కలెక్టరేట్‌ల నుంచి విడుదల చేసిన ప్రకటనలు పలు పత్రికలలో వెలువడ్డాయి. కమిటీల సమన్వయకర్తలు  సభ్యులను ఫోను ద్వారానో, లేఖల ద్వారానో సంప్రదించి ఒక నిర్దిష్టమైన తేదిని ఖరారు చేసి పలు విషయాలపై చర్చించవలసి ఉంటుంది. కానీ, అలాంటిది ఏమీ చేయకుండానే జూమ్‌ యాప్‌ ద్వారా, వాట్సాప్‌ మాధ్యమాల ద్వారా పలు మీటింగులు నిర్వహించి తమకు నచ్చినవారితో ముచ్చటిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి, అనుమానాలూ తలెత్తుతున్నాయి. సమన్వయకర్తలు ముందుగా సభ్యులతో సమావేశమయ్యి, పలు అంశాలపై చర్చించిన మీదట, ఈ అంశాలపై పట్టు ఉన్న సీనియర్లకు స్థానం కల్పించాల్సి ఉంది. కాని అలా జరగలేదు. సమగ్ర శిక్షా అభియాన్‌లో పిల్లలలో సాహిత్యం, ఇతర అంశాల పట్ల ఆసక్తి పెంపొందించి వాళ్ళలో జిజ్ఞాస కల్పించడం, రచనలు రచించే రీతిలో ప్రోత్సహించడం, ఆయా జిల్లాలోని గొప్పతనాన్ని చాటే విధమైన విషయాలలో రచనల పుస్తకరూపంలో ప్రచురించడం అనే అంశాలు ఉన్నాయి. వీటిపై ప్రతి జిల్లాకు ఇద్దరు సమన్వయకర్తలు, మరికొంతమంది ఉపాధ్యాయులు, కవులు, రచయితలతో కూడిన సభ్యుల కమిటీలు ఏర్పరిచి, ఈ అంశాలపై ఈ  చర్చించి ఏ విధంగా రచనల రూపకల్పన చేపట్టాలో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ కమిటీలోని వారి రచనలతోపాటు మరికొంతమంది నిష్ణాతుల రచనలు కూడా స్వీకరించి ఈ బృహత్తర ప్రయత్నానికి 13 జిల్లాల ‘సమగ్ర స్వరూపాన్ని’ ఆవిష్కరించవలసి వుంది. కానీ, జరుగుతున్నది మరో విధంగా ఉంది. ఈ విషయాన్ని గ్రహించి ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

చలపాక ప్రకాష్‌

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

Updated Date - 2020-09-11T06:13:46+05:30 IST