తాలిబన్లు మారిపోయారా..? ఆసక్తి రేపుతున్న పరిణామాలు..!

ABN , First Publish Date - 2021-08-16T23:16:21+05:30 IST

తాలిబన్లలో మార్పొచ్చిందా..తాజాగా పరిణామాలకు అర్థం ఏంటి..?

తాలిబన్లు మారిపోయారా..? ఆసక్తి రేపుతున్న పరిణామాలు..!

న్యూఢిల్లీ: తాలిబన్లు అంటే ముందుగా గుర్తుకువచ్చేది కరుడుగట్టిన మతఛాందసవాదం. వారు ఇస్లామిక్ సంప్రదాయాలకు భీకరమైన నిర్వచనాలు ఇస్తూ అఫ్ఘానిస్థాన్‌ను ఉక్కుపిడికిలిలో బంధించారు. మహిళలు, బాలికలు, మైనారిటీల స్వేఛ్చను హరించారు. అయితే.. ఇదంతా 1990 నాటి మాట..! ఒసామా బిన్ లాడెన్‌ను వేటాడేందుకు 2001లో అఫ్ఘానిస్థాన్‌లో కాలుపెట్టిన అమెరికా తాలిబన్ల ఆటను కట్టించింది. అడపాదడపా వారు అమెరికా సేనలపై దాడులు జరిపినా..అధికారానికి మాత్రం  20 ఏళ్ల పాటు దూరంగానే ఉండిపోయారు. అమెరికా సేనల నిష్క్రమణతో తాజాగా వారు మరోమారు అఫ్ఘానిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.




అయితే..ఈ మారు అఫ్ఘానిస్థాన్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అఫ్ఘాన్ ప్రజలు తమను చూసి ఆందోళన చెందాల్సి అవసరం లేదని తాలిబన్లు తొలి నుంచీ చెబుతూ వస్తున్నారు. గత ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యం లేదని భరోసా ఇస్తున్నారు. గతానికి పూర్తి భిన్నంగా తాలిబన్లు.. అంతర్జాతీయ సమాజం గుర్తింపు కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చట్టబద్ధంగా పాలన సాగిస్తామని ప్రపంచానికి హామీ ఇస్తున్నారు. అంతర్జాతీయ సమాజం తమ ప్రభుత్వాన్ని గుర్తించేలా వివిధ దేశాలతో చర్చలు జరుపుతామని కూడా చెబుతున్నారు. తమది నైతిక విజయమని నిరూపించే ప్రయత్నంలో భాగంగా..విదేశీ శక్తుల నుంచి అఫ్ఘానిస్థాన్‌ను విడిపించామని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు సహజంగానే అఫ్ఘాన్ వ్యవహారాల విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ శాంతివచనాలు, స్నేహపూర్వక వ్యాఖ్యలు తాలిబన్లలో మార్పుకు సంకేతమా అనే ప్రశ్నలను లేవనెత్తాయి. అయితే.. కేవలం ఈ వ్యాఖ్యల అధారంగా తాలిబన్లలో మార్పొచ్చిందని భావించడం తొందరపాటు అవుతుందనేది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాలని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - 2021-08-16T23:16:21+05:30 IST