పాకిస్థాన్లో యూపీ ఉందా?: శివసేన సూటి ప్రశ్న
ABN , First Publish Date - 2021-10-06T22:03:28+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి విపక్ష నేతలను రానీయకుండా నిర్బంధంలోకి తీసుకుంటుండటంపై బీజేపీని శివసేన ..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి విపక్ష నేతలను రానీయకుండా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంటుండటంపై బీజేపీని శివసేన నిలదీసింది. ''ఉత్తరప్రదేశ్ అనేది పాకిస్థాన్లో ఉందా?'' అని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం లఖింపూర్ కేరిలో 144 సెక్షన్ విధించి విపక్ష నేతలను లక్నోలోనే నిర్బంధంలోకి తీసుకుంటోందని అన్నారు. ఇదెలాంటి చట్టమని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారని, ఇదేమైనా కొత్త లాక్డౌనా? అని ఆయన తప్పుపట్టారు. అధికార యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ పంజరంలో చిలకగా మారినట్టుందని, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలిచ్చినా గుడ్డిగా చేసుకుంటూ పోతోందని, రైతులపై నుంచి కారు నడుపుకుంటూ వెళ్లినట్లు సాక్ష్యాలున్నాయని లఖింపూర్ ఘటనను ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.
''ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. రాహుల్ గాంధీ విమానం ఎక్కకుండా అడ్డుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆపేశారు. వాళ్లేం నేరం చేరారు? దేశంలో ఏదైనా కొత్త రాజ్యాంగం తెచ్చారా?'' అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. లఖింపూర్ కేరికి ప్రతినిధి బృందాన్ని పంపే విషయంలో విపక్ష పార్టీలన్నీ చర్చించాలని ఆయన సూచించారు.