Shia ముస్లింలను వదలం : ఐఎస్ హెచ్చరిక
ABN , First Publish Date - 2021-10-17T19:16:37+05:30 IST
షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని, వాళ్ళు
న్యూఢిల్లీ : షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని, వాళ్ళు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనలో హెచ్చరించింది. ‘‘బాగ్దాద్ నుంచి ఖొరసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలపై గురి పెడతాం’’ అని బెదిరించింది. ఈ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వార పత్రిక అల్-నబ ఈ హెచ్చరికను ప్రచురించింది. షియా ముస్లింలను వారి ఇళ్ళలో, ఇతర చోట్ల టార్గెట్ చేస్తామని ఇస్లామిక్ స్టేట్ తెలిపింది.
ఇదిలావుండగా, శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో ఉన్న ఇమామ్ బర్గాహ్-ఈ-ఫాతిమా మసీదులో పేలుడుకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ -ఖొరసాన్ ప్రకటించింది. ఈ పేలుడులో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 80 మంది గాయపడ్డారు. ఇది షియా ముస్లింల మసీదు. ఈ దారుణ హింసాకాండను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి సహకరించేవారందరినీ జవాబుదారులను చేయాలని పిలుపునిచ్చింది.
అక్టోబరు 8న ఆఫ్ఘనిస్థాన్లోని కుందుజ్లో ఓ షియా మసీదుపై ఉగ్రవాద దాడి జరిగింది. కుందుజ్లోని సయ్యద్ అబద్ మసీదుపై జరిగిన దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి కూడా తమ పనేనని ఐఎస్-కే ప్రకటించింది.