ఇక ఉద్యమమే..

ABN , First Publish Date - 2022-01-19T07:16:30+05:30 IST

ఇక ఉద్యమమే..

ఇక ఉద్యమమే..

పీఆర్సీపై చీకటి జీవోలను ఒప్పుకోం

వాటిని రద్దుచేసే వరకు పోరాడి తీరుతాం

ఈ నెల 22వ తేదీన పోరు కార్యాచరణ

గత ప్రభుత్వ ప్రయోజనాలనూ కాలరాస్తారా?

ఉద్యోగుల కోసం సమ్మెకు కూడా వెనుకాడబోం

జేఏసీ నేతలు బండి, బొప్పరాజు హెచ్చరిక


‘‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఐఆర్‌కంటే ఫిట్‌మెంట్‌ తగ్గించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆయువు పట్టు అయిన హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్లకు కోతపెడుతూ ఇప్పుడు జీవోలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో కనీసం చర్చలు కూడా జరపకుండా ఇచ్చిన ఈ జీవోలను తిరస్కరిస్తున్నాం. కార్యాచరణకు సిద్ధమవుతున్నాం’’                 


-బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌


‘‘ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే ఇంతకాలం ఓర్పు వహించాం. వాస్తవానికి తెలంగాణతో పోల్చితే ఏపీ రూ.88 వేల కోట్ల అదనపు ఆదాయం కలిగి ఉంది. 2013 - 14 నుంచీ తెలంగాణ కంటే ఏపీకి ఒక రూపాయి ఎక్కువగానే ఆదాయం ఉంది. కానీ, తెలంగాణ ఉద్యోగి డీఏలతో కలిపి 60 వేలు తీసుకుంటే.. ఏపీ ఉద్యోగి ఇకపై రూ.56 వేలు తీసుకుంటారు. ఇందుకు ఒప్పుకోం. ఉద్యమించి తీరుతాం’’

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌


విజయవాడ, అమరావతి. జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు కొత్తగా ప్రయోజనాలు కల్పించకపోగా, ఉన్నవాటినీ హరించివేసేలా ఉత్తర్వులు జారీ చేయటం దుర్మార్గమని, రాష్ట్ర చరిత్రలోనే ఏ ప్రభుత్వమూ ఇటువంటి చర్యకు ఒడిగట్టలేదని ఉద్యోగ జేఏసీల ఐక్యవేదిక అగ్ర నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు అక్కర లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో సానుకూల నిర్ణయాలు వస్తాయని ఇప్పటివరకు ఎదురు చూశామని, ఇకపై  ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ నెల 22వ తే దీన బెజవాడలో జరిగే ఇరు  జేఏసీలు భేటీలో కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైతే సమ్మెకు కూడా వెళతామని హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని ఏపీ ఎన్‌జీవో భవన్‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతిల అగ్రనేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. 


రాష్ట్ర చరిత్రలోనే దుర్మార్గమైన చర్య

‘‘27 శాతం పైనే ఫిట్‌మెంట్‌ వస్తుందని ఆశిస్తే, దానిని 23 శాతానికి ముఖ్యమంత్రి కుదించారు. డీఏల విడుదల, కాంట్రాక్టు , అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ , ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటివి ప్రస్తావిస్తూ.. తక్కిన అంశాలు చీఫ్‌ సెక్రటరీ దగ్గర మాట్లాడుకోవాలని సీఎం చెప్పటంతో సానుకూలంగా ఫలితాలు ఉంటాయని అనుకున్నాం. తీరా చూస్తే ఉద్యోగులకు గొడ్డలిపెట్టు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఇంత మోసం చేస్తారనుకోలేదు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి 30 శాతం, జిల్లా కేంద్రాలలో ఉండేవారికి 20 శాతం, మునిసిపల్‌ ఏరియాలలో ఉండేవారికి 14.5 శాతం, గ్రామాలలో ఉండే వారికి 12 శాతం చొప్పున హెచ్‌ఆర్‌ఏను గత ప్రభుత్వంలో సాధించుకున్నాం. వాటిని 10 లక్షల పైన జనాభా కలిగిన ప్రాంతాలలో ఉండేవారికి 20 శాతం, ఐదు  లక్షల పైన జనాభా కలిగిన ప్రాంతాలలో ఉండే వారికి 16 శాతం, గ్రామాలలో ఉండేవారికి 8 శాతం చొప్పున ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గం. పెన ్షనర్లకు 70 సంవత్సరాలకు లభించే 15 శాతం అదనపు పెన్షన్‌, 80 సంవత్సరాలు దాటిన వారికి ఇచ్చే 20 శాతం అదనపు పెన్షన్‌లను గత ప్రభుత్వ హయాంలో సాధించుకున్నాం. వీటిని కూడా  కాదని అదనపు పెన్షన్‌ కేటగిరీలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది?’’ 

- బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అధ్యక్షులు


ఇది చీకటి దినం

‘‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు ఇది చీకటి దినం. ఫిట్‌మెంట్‌పై నిర్ణయం ప్రకటించిన సీఎం..  మిగిలిన విషయాలను సీఎస్‌ సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పారు. కానీ, ఉద్యోగ సంఘాల ప్రమేయం లేకుండానే, ఎలాంటి చర్చ లేకుండానే పీఆర్సీపై జీవోలను జారీ చేశారు. ఇది దుర్మార్గం. ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చేలా దారుణ నిర్ణయాలు తీసుకోవడం జగన్‌ ప్రభుత్వానికే చెల్లింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సాధించుకున్న రాయితీలను రద్దు చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? డీఏలను  అడ్డం పెట్టుకుని ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాయటం తగదు. ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు, ముఖ్యమంత్రితో చర్చించటం ద్వారా సానుకూల నిర్ణయాలు వస్తాయని  ఇన్నాళ్లూ వేచి చూ శాం. కానీ, ఉద్యోగులను ఇంకాస్త నిరాశ పరిచేలా వ్యతిరేక జీవోలు విడుదల చేశారు. పోరాడటం తప్ప మాకు మరో దారి లేకుండా చేశారు. జీతాలను పెంచాల్సిన పరిస్థితులలో.. వాటిని హరించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నందునే ఆందోళన బాట పడుతున్నాం. ఉద్యోగి ఇంటి అద్దెను (హెచ్‌ఆర్‌ఏ) 500 రూపాయలుగా నిర్ణయించడం కంటే దారుణమైన విషయం మరేదైనా ఉంటుందా?’’ 

- బొప్పరాజు వెంకటేశ్వర్లు,  

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ 



జీవోలను పునఃసమీక్షించాల్సిందే: సూర్యనారాయణ

ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ జీవోలను పునః సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అధికారులేం చెప్పినా...ఆర్థిక పరిస్థితి ఎలాఉన్నా...పీఆర్సీ జీవోలపై సమీక్ష జరగాల్సిందే. ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటన కంటే భిన్నంగా జీవో ఉంది. మధ్యంతర భృతిని తిరిగి రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి ప్రక్రియ గురించి ఇంతవరకు మేం వినలేదు. రాజకీయ కోణంలో చూసినా.. ఇది సరైన నిర్ణయం కాదు’’ అని సూర్యనారాయణ కోరారు.


జీవోలన్నీ వెనక్కి తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి

పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ వెనక్కి తీసుకోవాలని ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాం డ్‌ చేశారు. ‘‘మేం అధికారుల కమిటీ నివేదికను ప్రతి సమావేశంలోనూ వ్యతిరేకించాం. ఈ కమిటీ హెచ్‌ఆర్‌ఏ స్లాబులను దారుణంగా తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన హెచ్‌ఆర్‌ఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ప్రతిఫలించలేదు. 11వ పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చి మళ్లీ చర్చలకు పిలవాలి. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పరస్పర అంగీకారంతో జీవోలు రావాలిగానీ ఏక పక్షంగా విడుదల చేయడం దారుణం. అంతా కలిసి ఒక్క మాటపై నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం’’అని వెంకట్రామిరెడ్డి కోరారు. అనంతరం సీఎంవో అధికారులను కలిసి, ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలవాలని కోరినట్టు తెలిసింది. 

Updated Date - 2022-01-19T07:16:30+05:30 IST