అమరవీరులను స్మరించడం మన బాధ్యత
ABN , First Publish Date - 2021-10-22T06:45:31+05:30 IST
సమాజంకోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించడం మన బాధ్యతని అదనపు జిల్లా న్యాయమూర్తి వీర్రాజు పేర్కొన్నారు.
తిరుపతిలో అదనపు జిల్లా జడ్జి వీర్రాజు
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 21: సమాజంకోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించడం మన బాధ్యతని అదనపు జిల్లా న్యాయమూర్తి వీర్రాజు పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ ఎంఆర్పల్లె పోలీసు పరేడ్ మైదానంలో గురువారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంకోసం, ప్రజలకోసం అమరలైన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని సూచించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం విధిగా చేయాల్సిన కార్యక్రమమని కార్పొరేషన్ కమిషనరు గిరీష పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాలోనూ ఎందరో పోలీసులు విధినిర్వహణలో ప్రాణాలు అర్పించారని ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వారిలో 777 మంది కొవిడ్ బారిన పడగా, ఎనిమిది మంది మృతిచెందారని ఆవేదన వ్యక్తంచేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పోలీసుశాఖ ద్వారా వచ్చిన నగదు చెక్కులను వారి కుటుంబసభ్యులకు ముఖ్య అతిథులు అందజేశారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అమరవీరుల స్థూపానికి గౌరవవందనం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరీఫుల్లా, మునిరామయ్య, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.