కేంద్రమంత్రిని అవమానించడం సిగ్గుచేటు
ABN , First Publish Date - 2022-09-04T07:11:07+05:30 IST
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ మహిళగా ప్రజా సమస్యలు తెలుసుకుంటే టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, అనవసర వ్యాఖ్యలెందుకు చేస్తున్నారని ఎంపీ ధర్మపు రి అర్వింద్ ప్రశ్నించారు. శనివారం రూరల్ మండలంలోని మాధవనగర్ బీఎల్ఎన్ గార్డెన్లో ‘ఇందూరు కీ జనతాకో..! జర జవాబ్ దో..!’ అనే నినాదంతో బహిరంగ సభ నిర్వహించారు.
నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా పర్యటిస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఉలుకెందుకు?
ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజం
నిజామాబాద్ రూరల్, సెప్టెంబరు 3: దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ మహిళగా ప్రజా సమస్యలు తెలుసుకుంటే టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, అనవసర వ్యాఖ్యలెందుకు చేస్తున్నారని ఎంపీ ధర్మపు రి అర్వింద్ ప్రశ్నించారు. శనివారం రూరల్ మండలంలోని మాధవనగర్ బీఎల్ఎన్ గార్డెన్లో ‘ఇందూరు కీ జనతాకో..! జర జవాబ్ దో..!’ అనే నినాదంతో బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. మంత్రులు ప్రశాంత్రెడ్డి, హరీష్రావు, ఎమ్మెల్యేలు అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. రేషన్ దుకాణాలు, ఆసుపత్రులు, పీఏసీఎస్లకు వెళ్లి అక్కడి సమస్యలు తెలుసుకుంటుంటే టీఆర్ఎస్ నేతలు ఎందుకు భరించలేకపోతున్నారని ప్రశ్నించారు. రేషన్ దుకాణం, వ్యవసాయ సొసైటీ, పీహెచ్సీల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటే టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్రెడ్డి తెలుగు ఆడపడచు నిర్మలాసీతారామన్ను సిగ్గుం దా? అనడం ఎంత అవమానకరం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన గొప్ప మహిళ నిర్మలా సీతారామ న్ అని కొనియాడారు. అటువంటి తెలుగు మహిళను మంత్రి ప్రశాంత్రెడ్డి సిగ్గుందా అని వ్యాఖ్యానించడం దౌర్భాగ్యం. ఇటువంటి సిగ్గులేని వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్రెడ్డిని కన్నందుకు ఇందూరు గడ్డ నిజంగానే సిగ్గుపడుతుందన్నారు. ఆయన వ్యాఖ్యలతో మనందరం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్కు వెళ్లి తెలంగాణ పరువు తీశారని, ఆయన పెడతానన్న బీఆర్ఎస్ పార్టీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జిల్లాకు ఇచ్చిన హామీలన్నీ నీటిముటలయ్యాయని ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి ఏ మైందన్నారు. 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇచ్చిన ఘ నత కేంద్రానిదన్నారు. బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం, జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ఏర్పాటు, మోతెలో పసుపు పరిశోధక కేంద్రం ఏర్పాటు, గల్ఫ్ బాధితుల కోసం రూ.500 కోట్లతో ప్యాకేజీ ఏర్పాటు, బీడీ కార్మికుల కోసం బీడీ భవన్ ఏమైందని కేసీఆర్ను అర్వింద్ ప్రశ్నించారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ను విజయవంతంగా అమలు చేస్తున్నాయన్నారు. కేటీఆర్, కవితలు స్కాంల్లో కూరుకుపోయారని విమర్శించారు. రాష్ట్రం లో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమన్నారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. తాను మొదటి ఉద్యోగం నిజామాబాద్లోనే చేశానని, ఇన్నేళ్ల తర్వాత రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సభలో బీజేపీ నేతలు బస్వ లక్ష్మీనర్సయ్య, ధన్పాల్ సూర్యనారాయణ, పల్లె గంగారెడ్డి, ఏలేటి అన్నపూర్ణ, దినేష్ కులాచారి, తదితరులు పాల్గొన్నారు.