సక్కు కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు
ABN , First Publish Date - 2021-12-08T05:30:47+05:30 IST
నగరంలోని సక్కు కార్పొరేట్ కార్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ తనిఖీలు నిర్వహించింది.
గుంటూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): నగరంలోని సక్కు కార్పొరేట్ కార్యాలయంలో ఆదాయపు పన్నుశాఖ తనిఖీలు నిర్వహించింది. మంగళవారం ఉదయం నుంచే లక్ష్మీపురం మెయిన్ రోడ్డులోని ఆ కార్యాలయాన్ని ఐటీ బృందాలు దిగ్బంధించాయి. స్థానిక పోలీసుల సహకారం తీసుకొని ట్రాఫిక్ని కాసేపు నియంత్రించాయి. అనంతరం సక్కు ఆఫీసు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులతో సహా మరెవ్వరిని లోపలికి అనుమతించలేదు. 75 మంది ఐటీ అధికారులు/ఉద్యోగులు ఏకకాలంలో ఒక కార్పొరేట్ ఆఫీసులో సోదాకు దిగడం వ్యాపార వర్గాల్లో కలకలం రేకెత్తించింది. రాత్రి 8 గంటలకు కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సక్కు గ్రూపునకు పౌల్టీ, ప్రత్తి వ్యాపార సంస్థలున్నాయి. వాటిల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలిసింది.