సీఎం హామీ ఇస్తే అమలు చేయాల్సిందే

ABN , First Publish Date - 2021-07-23T07:18:12+05:30 IST

బహిరంగ వేదికలపై ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలు ఇచ్చి, వాటిని గాలికి వదిలేయడం,

సీఎం హామీ ఇస్తే అమలు చేయాల్సిందే

  • అమలు కోరుతూ ప్రజలు కోర్టుకెక్కొచ్చు
  • కుదరదంటే ప్రభుత్వం కారణం చెప్పాలి.. విధాన నిర్ణయం ప్రకటించకుండా నాన్చడం కుదరదు
  • అమలౌతాయని ప్రజలు ఆశించరనడం సరికాదు.. కేజ్రీవాల్‌ హామీపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
  • ఇతర రాష్ట్రాల్లోనూ సీఎంల హామీలపై తీర్పు ప్రభావం


బహిరంగ వేదికలపై ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలు ఇచ్చి, వాటిని గాలికి వదిలేయడం, అవసరం తీరాక అవి గుర్తే లేనట్లు మౌనం దాల్చడం ఇక కుదరకపోవచ్చు. వాటి అమలు ఆర్థికంగా సాధ్యమో కాదో హామీ ఇచ్చే ముందే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి అమలుకు సాకులు చెప్పడానికి ఉండదు. రాజకీయ నాయకులు హామీ ఇచ్చిన తర్వాత అది అమలు కాదని ప్రజలు భావిస్తారంటూ నిరాసక్తంగా ఉండడమూ కుదరదు. ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు సారాంశం ఇదే. ముఖ్యమంత్రి నోటి నుంచి వెలువడిన వరాల అమలు కోసం వాటి నుంచి లబ్ధి పొందాల్సిన వర్గాల ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. 



న్యూఢిల్లీ, జూలై 22: ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విలేకరుల సమావేశంలోనో మరో బహిరంగ వేదికపైనో ఇచ్చే హామీల అమలుకు ప్రజలు  న్యాయస్థానాల ద్వారా పట్టుబట్టవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొవిడ్‌ కష్టకాలంలో ఇంటి అద్దె కట్టలేని వలస కార్మికుల అద్దె బకాయిలను తాము చెల్లిస్తామని గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడాన్ని తీవ్రంగా తప్బుబట్టింది. కేజ్రీవాల్‌ ఎవర్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రకటన చేశారో వారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హామీ అమలుపై 6 వారాల్లో విధాన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌ గురువారం తీర్పు వెలువరించారు.


సీఎం హామీ ఇచ్చిన సంక్షోభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ హామీఅమలుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏకపక్షం కిందకు రాదని, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చట్ట వ్యతిరేకం అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒకసారి హామీ ఇచ్చాక ఆ హామీని అమలు చేయాలా వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. నాటి హామీని లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఇంటి యజమానులు, కిరాయిదారుల వర్గాల గాయాలకు ఉపశమన లేపనంగా సీఎం ప్రకటించారని, అలాంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.


లాక్‌డౌన్‌తో  మొదలైన భారీ వలసల నేపథ్యంలో ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేసిన ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను  ప్రభుత్వం తేలిగ్గా పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై నిర్ణయం తీసుకున్నపుడే సరైన పాలన అనిపించుకుంటుందని తేల్చిచెప్పారు. ఏమీ తేల్చకుండా నాన్చడం సమస్యకు సమాధానం కాదని 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. గత ఏడాది మార్చి 29న కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ కిరాయిదారులు, ఇంటి యజమానులు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ప్రతిభ ఈ తీర్పునిచ్చారు. కిరాయి చెల్లించలేని వారు చెల్లించనక్కరలేదని నాటి విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ చెప్పారు.


ఇంటి యజమానులు కూడా కిరాయి కోసం బలవంతం చేయొద్దని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని తెలిపారు. సీఎం ఇచ్చిన హమీ, వాగ్దానం లేదా చేసిన ప్రకటన స్పష్టంగా అమలు చేయదగ్గ వాగ్దానం అవుతుందని జస్టిస్‌ ప్రతిభ తన తీర్పులో స్పష్టం చేశారు. దాని అమలు అంశాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. సుపరిపాలనలో పాలకులు ప్రజలకిచ్చిన హామీలను సహేతుకమైన, సమర్థనీయమైన కారణాల్లేకుండా పక్కన పెట్టరాదని అన్నారు. ఒట్టు వేసేదే గట్టున పెట్టేందుకనేది సామాజిక అంశాలకే పరిమితమయ్యే పాత నానుడి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.




ప్రభుత్వ పాలన విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలన్న లక్ష్యంతోనే మాట తప్పడం కుదరని హామీలు(ప్రామిసరీ ఎస్టోపెల్‌), చట్టబద్ధ ఆకాంక్షల(లెజిటిమేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌) సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎలాంటి సంశయం లేకుండా  అంగీకరిస్తున్నపుడు దానిపై ఎలాంటి చర్యా లేకపోవడాన్ని ఏ మాత్రం అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాధినేతలుగా ఎన్నికైన వ్యక్తులు, బాధ్యతాయుత హోదాల్లో ఉన్నవారు సంక్షోభ సమయాల్లో తమ పౌరులకు బాధ్యతాయుత హామీలను ఇవ్వాలని ప్రజలు ఆశిస్తారని చెప్పారు.


సీఎం స్థాయి వ్యక్తి రాజ్యాంగ హోదాలో చెప్పిన మాటలు అమలవుతాయని ప్రజలు భావిస్తారన్నారు. కేజ్రీవాల్‌ మాటలను ఏ ఇంటి యజమాని కానీ, కిరాయిదారు కానీ నమ్మి ఉండరని చెప్పడం కుదరదని స్పష్టం చేశారు.  కరోనా లాంటి విపత్తు సమయాల్లో నిలవడానికి నీడ లాంటి ప్రకృతి ప్రసాదిత హక్కులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, ప్రాథమిక హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయాల్సి ఉంటుందని, దాన్ని తిరస్కరించాలంటే అంతకన్నా పెద్ద కారణం చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. కేజ్రీవాల్‌ ఇంటి అద్దె హామీని ఎన్నికల సభలో ఇవ్వలేదని, విపత్తు సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిఆర్థిక పరమైన పర్యవసానాలు అన్నీ తెలిసే హామీ ఇచ్చారని, దాని అమలుకు ఆయన తన సంపూర్ణ అధికారాన్ని ఉపయోగిస్తారనే అభిప్రాయంలోనే ప్రజలు ఉంటారని న్యాయమూర్తి చెప్పారు.


హేతుబద్ధంగా ఆలోచించే ఏ పౌరుడైనా ముఖ్యమంత్రి సదరు హామీ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం తరఫునే మాట్లాడుతున్నారని అనుకుంటారన్నారు. లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఊళ్లకు పొలోమని వెళుతున్న సమయంలో ఇచ్చిన హామీని తేలిగ్గా ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలన మొత్తం రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పేరిట జరుగుతుందని, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ కారణం చూపి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-07-23T07:18:12+05:30 IST