హుజురాబాద్లో టెన్షన్.. టెన్షన్.. ఈటల వర్సెస్ పల్లా
ABN , First Publish Date - 2021-06-17T17:50:39+05:30 IST
హూజురాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్గా పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల్లోకెళితే.. పల్లా
కరీంనగర్ : హూజురాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్గా పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాల్లోకెళితే.. పల్లా గురువారం నాడు పర్యటించారు. అయితే.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా హూజురాబాద్లో పర్యటించారు. ఈ క్రమంలో హుజురాబాద్లోని కాట్రపల్లి వద్ద ఈటల-పల్లా రాజేశ్వర్ వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో కాట్రాపల్లి వద్ద పల్లాను చూసిన ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు ‘జై ఈటల.. జైజై ఈటల.. జై బీజేపీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
మరోవైపు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి వాహనంలో ఉన్న కార్యకర్తలు కూడా ‘జై టీఆర్ఎస్.. జై పల్లా రాజేశ్వర్ రెడ్డి’ అంటూ పోటా పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరుపార్టీల నినాదాలతో కాట్రపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరువర్గీయులను పంపేసి ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు.