అత్యంత దిగ్భ్రాంతికరం : మోదీకి లేఖలో మమత

ABN , First Publish Date - 2022-01-16T23:11:32+05:30 IST

న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల కోసం పశ్చిమ బెంగాల్

అత్యంత దిగ్భ్రాంతికరం : మోదీకి లేఖలో మమత

కోల్‌కతా : న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని తిరస్కరించడంపై పునరాలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోరారు. తమ శకటాన్ని తిరస్కరించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని, ఇది అత్యంత దిగ్భ్రాంతికరమని ఆరోపించారు. ఎటువంటి కారణం చూపకుండానే తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించారన్నారు. ఈ మేరకు ఆమె మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. 


నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనను, ఆయన నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీని గుర్తు చేసుకునే విధంగా ఈ శకటాన్ని రూపొందించినట్లు తెలిపారు. విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద, చిత్తరంజన్ దాస్, శ్రీ అరబిందో, మాతంగిని, హజ్రా, బిర్సా ముండా, నజ్రుల్ ఇస్లాం చిత్రాలు దీనిలో ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల పశ్చిమ బెంగాల్ ప్రజలంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ ముందు వరుసలో ఉందని, దేశ విభజన ద్వారా భారీ మూల్యం చెల్లించిందని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సాంఘిక సంస్కర్త శ్రీ నారాయణ గురు, జటాయు పార్క్‌లపై దీనిని రూపొందించారు. శ్రీ ఆది శంకరాచార్య గురించి శకటాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కేరళ ప్రభుత్వం ఈ శకటాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-01-16T23:11:32+05:30 IST