జాక్ మా కోటకు బీటలు!
ABN , First Publish Date - 2021-10-27T08:17:16+05:30 IST
ఏడాది కాలంలో రూ.25.80 లక్షల కోట్లు క్షీణించిన అలీబాబా మార్కెట్ విలువ ...
ఏడాది కాలంలో రూ.25.80 లక్షల కోట్లు క్షీణించిన అలీబాబా మార్కెట్ విలువ
గత ఏడాది అక్టోబరులో చైనా ఆర్థిక విధానాలను విమర్శించినందుకు జాక్ మా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆయన స్థాపించిన అలీబాబా గ్రూప్ మార్కెట్ విలువ గడిచిన ఏడాది కాలంలో 34,400 కోట్ల డాలర్ల (రూ.25.80 లక్షల కోట్లు) మేర పతనమైంది. ప్రపంచంలో ఏదేని వ్యాపార గ్రూప్ ఏడాది కాలంలో కోల్పోయిన మార్కెట్ సంపదలో ఇదే అత్యధికం. జాక్ మా విమర్శలు చేసిన కొద్ది రోజులకే జిన్పింగ్ సర్కారు అలీబాబా గ్రూప్పై కొరడా ఝుళిపించింది. ‘అలీబాబా’కు చెందిన ఫిన్ టెక్ సేవల విభాగమైన యాంట్ గ్రూప్ లిస్టింగ్ను రద్దు చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగానికి చెందిన పలు కంపెనీలపై చేపట్టిన చర్యలు కూడా అలీబాబాకు ప్రతికూలంగా పరిణమించాయి. దాంతో కంపెనీ షేర్లు క్రమంగా పతనమవుతూ వచ్చాయి. గత ఏడాది అక్టోబర్లో నమోదు చేసుకున్న ఆల్టైం గరిష్ఠ స్థాయి నుంచి మూడు వారాల క్రితం రికార్డు కనిష్ఠానికి పడిపోయాయి. ఈ నెల కనిష్ఠ స్థాయితో పోల్చితే, ప్రస్తుతం అలీబాబా షేరు ధర 30 శాతం మేర పుంజుకున్నప్పటికీ, క్రితం అక్టోబర్ నాటి గరిష్ఠంతో పోల్చితే 43 శాతం తక్కువ స్థాయిలోనే ట్రేడవుతోంది.