జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-06-14T18:20:56+05:30 IST

ఏపీ సీఎం జగన్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా పడింది. జగన్ వేసిన కౌంటర్‌కు సంబంధించి రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు రిజాయిండర్ ఇచ్చారు.


జగన్ బెయిల్ రద్దు పిటిషన్ అనేది పిటిషన్ అర్హత సాధించిన తరువాతనే కోర్టు విచారణకు స్వీకరించిందని రఘురామ తరఫు న్యాయవాది అన్నారు.  జగన్ అక్రమాస్తుల కేసులో చాలా మంది అధికారులు  సాక్షులుగా,  నిందితులు ఉన్నారన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వారు మంచి స్థాయిలో ఉన్నారని, దీంతో అధికారులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్  అధికారుల బదిలీలు, నియామకాలు చీఫ్ సెక్రెటరీ చూడాల్సి ఉంటుందని... కానీ ఏపీలో ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఐఏఎస్ , ఐపీఎస్‌లను ముఖ్యమంత్రే స్వయంగా నియమించేలా జీవో తెచ్చారన్నారు. దీంతో అక్కడ అధికారులను ఎదో రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు.  రఘురామ కృష్ణంరాజుపై 8 కేసులు ఉన్నాయని, ఒకటి సీబీఐ, ఏపీలో 7 కేసులు ఉన్నాయన్నారు. ఒక్క కంప్లైట్‌లో మూడు కేసులు చేర్చారన్నారు. రాఘురామ రాజకీయంగా, వ్యక్తిగతంగా లబ్ది పొందడానికి పిటిషన్ వేయలేదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తిపై 11 ఛార్జ్ షీట్‌లు ఉన్నాయని, కాబట్టి ఈ దేశ పౌరుడిగా ఆ కేసులుపై విచారణ చేయాలని కోరే అర్హత రఘురామకు ఉందన్నారు. సాక్షులను ప్రభావితం కాకుండా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందని రఘురామ తరఫు న్యాయవాది రిజాయిండర్‌లో పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ జులై 1వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2021-06-14T18:20:56+05:30 IST