జగన్రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది: పవన్
ABN , First Publish Date - 2021-11-23T02:57:18+05:30 IST
జగన్రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.
అమరావతి: జగన్రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. హైకోర్టు నుంచి తప్పించుకోడానికే హడావిడి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. జగన్రెడ్డి మరింత స్పష్టతతో కొత్త బిల్లును తెస్తామంటూ.. ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని తప్పుబట్టారు. రాజధాని అంశంపై హైకోర్టులో వేగంగా విచారణ జరుగుతుందన్నారు. తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికే బిల్లుల రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి ఏడున్నరేళ్లైనా రాజధాని ఎక్కడుందో తెలియని దుస్థితి ఉందని పేర్కొన్నారు. వికేంద్రీకరణ అంటూ చిలకపలుకు పలుకుతున్న పాలకులు.. ఏ రాష్ట్రంలోనూ 2, 3 రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారని పవన్ దుయ్యబట్టారు. వైసీపీ పెద్దలు 3 రాజధానులతోనే అభివృద్ధి జరుగుతుందనే భ్రమలోనే ఉన్నారని ధ్వజమెత్తారు. 3 రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనే.. భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా జగన్రెడ్డి ఏం చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.