హామీలన్నీ అమలు చేసి జగన్ ఆశ్చర్య పరిచారు: సజ్జల
ABN , First Publish Date - 2020-06-01T23:51:04+05:30 IST
పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. సీఎం జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అమరావతి: పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. సీఎం జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. హామీలన్నీ తొలి ఏడాదిలోపే అమలు చేసి జగన్ ఆశ్చర్య పరిచారని తెలిపారు. అందుకే ప్రత్యర్థులు తమ సహజసిద్ధమైన లిటిగెంట్ స్వభావంతో.. పిటిషన్లు వేసి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే జగన్ అభిమానుల్లో అసహనం కలుగుతోందన్నారు. రుణమాఫీ పేరుతో పెద్దపెద్ద హామీలు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా రైతులకు సాయం చేయలేకపోయారని విమర్శించారు. జగన్ తొలిఏడాదిలోనే రైతులకు రూ.10 వేల కోట్లపైనే సాయం చేశారని పేర్కొన్నారు. బాధ్యతగల ప్రతిపక్షమైతే ఏ కారణాల వల్ల ఓడిపోయారో.. ఆత్మవిశ్లేషణ చేసుకుని, తప్పుల్ని సరిదిద్దుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవుపలికారు.