భూ రీసర్వేతో హక్కుదారులకు లబ్ధి

ABN , First Publish Date - 2022-01-19T06:04:27+05:30 IST

భూ రీసర్వే ద్వారా నిజమైన హక్కుదారులకే శాశ్వత భూహక్కు లభిస్తుందని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

భూ రీసర్వేతో హక్కుదారులకు లబ్ధి
మహిళకు పత్రాలను అందిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు ఆళ్ల, అన్నాబత్తిన

అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌ సర్వే 

జగనన్న భూహక్కు పత్రాల పంపిణీలో కలెక్టర్‌

దుగ్గిరాల, జనవరి 18: భూ రీసర్వే ద్వారా నిజమైన హక్కుదారులకే శాశ్వత భూహక్కు లభిస్తుందని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. జగనన్న శాశ్వత భూహక్కు భూ పరిరక్షణ పథకం భూపత్రాలను మంగళవారం పంపిణీ చేశారు. వర్చువల్‌ విధానంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా దుగ్గిరాల సచివాలయం నుంచి కలెక్టర్‌ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని డిజిటల్‌ స్ర్కీన్‌ ద్వారా అధికారులు, ప్రజలు వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌లతో సర్వే నిర్వహించి హక్కుదారులకు శాశ్వత పట్టాదారు పాసుపుస్తకాన్ని అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో తొలివిడతగా ఐదు గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా రీసర్వే జరిగిందని తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామకంఠాల్లో ఉన్న భూములను సర్వే చేయించి హక్కుదారులకు భూ హక్కు పత్రాలను అందించామన్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్‌ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఇలాంటి చారిత్రాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడం జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమైందన్నారు. జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ భూ రీసర్వే చేసి వెంటనే భూహక్కు పత్రాలను అందిస్తామన్నారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టీనా, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, సర్పంచ్‌ కుషీబాయి, తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధిమీనా, తహసీల్దారు మల్లీశ్వరి, డీటీ కల్యాణి, ఈవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T06:04:27+05:30 IST