జగనన్న తోడు ద్వారా జిల్లాకు రూ.35.97 కోట్లు
ABN , First Publish Date - 2020-11-26T06:19:24+05:30 IST
జగనన్న తోడు ద్వారా జిల్లాకు రూ.35.97 కోట్లు
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడి
విజయవాడ సిటీ : జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు జిల్లాలో రూ.35.97 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పథకం అమలుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, లబ్ధిదారులతో బుధవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి వెలంపల్లి, కలెక్టర్ ఇంతియాజ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేల వడ్డీలేని రుణాలను ఇస్తున్నామన్నారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు వలంటీర్లు చిరు వ్యాపారుల వద్దకే వెళ్లి వారి వివరాలు తీసుకుని జాబితాలను తయారుచేసి సచివాలయాల్లో ఉంచారని, అనంతరం ఆయా బ్యాంక్ శాఖలకు ఆన్లైన్ ద్వారా పంపించినట్టు చెప్పారు. ఇంకా అర్హులు ఉంటే దగ్గరలోని వలంటీర్ను గానీ, సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీని గానీ కలిసి దరఖాస్తు అందజేయాలని చెప్పారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమేశ్, మల్లాది విష్ణు, కె.అనీల్కుమార్, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జేసీలు ఎల్.శివశంకర్, కె.మోహన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.