రూ.3.63 కోట్లతో జలజీవన్ మిషన్
ABN , First Publish Date - 2022-01-22T04:25:33+05:30 IST
గ్రామాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ పథకాన్ని అమలు చేయనున్నాయి.
18 గ్రామాల్లో అమలు
50 నివాస ప్రాంతాలుగా విభజన
రూ.26.6 లక్షలతో సౌత్మోపూరుకు టెండర్లు పూర్తి
కేంద్రం, రాష్ట్రం చెరిసగం నిధులు
నెల్లూరు రూరల్, జనవరి 21 :
గ్రామాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ మండలంలోని పల్లెల్లో రూ.3.63 కోట్లతో పనులు చేపట్టనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులు సమకూర్చడం ద్వారా రాబోవు రెండేళ్ల లో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయనున్నాయి.
సురక్షితమైన తాగునీరు అందక గ్రామీణులు రోగాల బారినపడుతున్నారని వివిధ సర్వేల ద్వారా తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జలజీ వన్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామ పంచా యతీల్లో ఇది అమలు కానుంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం మండలాన్ని 50 హ్యబిటేషన్లుగా విభజించారు. రూ.5లక్షలకుపైగా ఖర్చయ్యే హ్యాబిటేషన్లు 22 ఉన్నట్లు గుర్తించారు. వాటిలో సౌత్మోపూరు గ్రామంలోని రెండు హ్యాబిటేషన్లకు రూ.26.6 లక్షలతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 20 హ్యబిటేషన్లల్లో రూ. 2.85 కోట్లతో ఒకే టెండరు ద్వారా పనులన్నీ పూర్తి చేసేందుకు విజయవాడ స్థాయిలో టెండర్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.5 లక్షలులోపు అంచనా వ్యయం ఉన్న 28 హ్యబిటేషన్లలో నామినేషన్ పద్ధతిలో కొళాయిలను ఏర్పాటు చేయనున్నారు. 2024 సంవత్సరానికల్లా గ్రామాల్లోని అన్ని ఇళ్లకు తాగునీటి కొళాయిని ఏర్పాటు చేసే విధంగా పథకానికి రూపకల్పన చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. డైరెక్టు పంపింగ్, ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీటిని కొళాయిలకు అందచేయనున్నారు.