జమ్మలమడుగులో బాంబుల కలకలం
ABN , First Publish Date - 2020-07-12T17:35:02+05:30 IST
జమ్మలమడుగులో బాంబుల కలకలం రేగింది. ఈనెల 7వ తేదీ..
ఆలస్యంగా వెలుగులోకి
ధ్రువీకరించిన పోలీసులు
జమ్మలమడుగు(కడప): జమ్మలమడుగులో బాంబుల కలకలం రేగింది. ఈనెల 7వ తేదీ జమ్మలమడుగు మండలంలోని పి.సుగుమంచిపల్లె గ్రామశివార్లలో నాపరాళ్ల గనుల సమీపాన ఓ రైతు పొలంలో మూడు బకెట్ల బాంబులు లభ్యమైనట్లు ప్రచారం జరిగింది. జమ్మలమడుగు అర్బన్ పోలీసులు అదేరోజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు సమాచారం.
పులివెందులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నందున పోలీసులు బాంబుల విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఈనోటా ఆనోటా పడి జమ్మలమడుగులో బాగా ప్రచారం కావడంతో పోలీసు అధికారులు శనివారం సమాచారాన్ని బయటపెట్టారు. జమ్మలమడుగు అర్బన్ సీఐ మధుసూదన్రావు మాట్లాడుతూ సుగుమంచిపల్లె వద్ద ఒక బాంబు లభ్యమైందన్నారు. అక్కడ ఇటీవల భూమిని చదును చేస్తున్నప్పుడు ఎక్సకవేటర్ ద్వారా మట్టిని తీస్తున్న సమయంలో పైపులు పగిలి ఒక బాంబు లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే కడప నుంచి డాగ్ స్క్వాడ్ను రప్పించి తనిఖీలు నిర్వహించామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.