ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించుకోవాలి: జనసేన నేత
ABN , First Publish Date - 2021-03-02T16:21:02+05:30 IST
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీ అధికార దౌర్జన్యానికి పాల్పడుతోందని జనసేన రీజనల్ కోఆర్డినేటర్ కళ్యాణం శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.
గుంటూరు: మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీ అధికార దౌర్జన్యానికి పాల్పడుతోందని జనసేన రీజనల్ కోఆర్డినేటర్ కళ్యాణం శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. పోలీసులతో జనసేన పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. 46వ డివిజన్ జనసేన కార్యకర్తలను డబ్బులు పంచుతున్నారని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారని....29 వ డివిజన్ అభ్యర్థి నక్కల వంశీని నగరం పాలెం పోలీసులు బెదిరించారని ఆయన తెలిపారు. తప్పుడు కేసు పెట్టి పోటీ నుంచి తప్పుకోవాలని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించుకోవాలని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం చెప్పిన అడ్డుగోలు పనులు చేసి ఐఏఎస్లు సైతం జైలుకు వెళ్లిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. 151 సీట్లు వచ్చిన వైసీపీ.. జనసేన అభ్యర్థులను చూసి భయపడటం ఎందుకని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఆదరణ చూసి వైసీపీ భయపడుతోందని తెలిపారు. వైసీపీ ప్రజాదరణ కోల్పోయింది కాబట్టే జనసేన అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలలో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని శ్రీనివాస్ తెలిపారు.