పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతం: పవన్ కళ్యాణ్
ABN , First Publish Date - 2020-06-05T18:10:58+05:30 IST
పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతం: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని స్పష్టం చేశారు. మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమన్నారు. మానవ మనుగడకు ఆధారం పంచభూతాలని.... నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అందరి ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి వుందన్నారు.
చక్కటి పర్యావరణం ఉన్నచోట ఆస్పత్రుల అవసరమే ఉందని నిపుణుల చెబుతారని తెలిపారు. జనసేన మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తోందని అందులో భాగంగానే “మన నది- మన నుడి” కార్యక్రమాన్ని చేపట్టినట్లు పవన్ తెలిపారు. ఈ రోజున (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని,
ఈ ఏడాదిలో పర్యావరణాన్ని పరిరక్షించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సిన రోజు ఇది అని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే “మన నది- మన నుడి” కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళతామని వెల్లడించారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని చెప్పారు. అందరికీ ఆరోగ్య ప్రదాయని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు. ‘‘మన అడవులు, కొండలు, నదులను మనమే కాపాడుకోవాలి’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.