విజిలెన్స్, ఏసీబీ ఉన్నతాధికారులకు పోతిన మహేష్ లేఖ
ABN , First Publish Date - 2021-06-25T15:12:41+05:30 IST
అక్రమ నిర్మాణాలు నిరోధించాలంటూ విజిలెన్స్, ఏసీబీ ఉన్నతాధికారులకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ లేఖ రాశారు
విజయవాడ: అక్రమ నిర్మాణాలు నిరోధించాలంటూ విజిలెన్స్, ఏసీబీ ఉన్నతాధికారులకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ లేఖ రాశారు. అక్రమ నిర్మాణాలకు చెందిన ఫోటోలను కూడా మహేష్ జతచేశారు. అక్రమ కట్టడాలు, అడ్డగోలు నిర్మాణాలు చేసిన వారిని, అనుమతి ఇచ్చిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో రోజు రోజుకి అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయన్నారు. కార్పొరేషన్ ఖజానాకు చెల్లించాల్సిన రుసుములను చెల్లించకుండా నగర అభివృద్ధికి అక్రమార్కులు అడుగడుగున అడ్డుపడుతున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలను యదేచ్చగా ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అనధికార నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయన్నారు. అధికారులే అవినీతికి సహకరిస్తున్నారని అనుమానం కలుగుతోందని చెప్పారు. నివాస భవన అనుమతులు పొంది కమర్షియల్ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు అనధికార నిర్మాణాలపై దృష్టి సారించి నియంత్రించాలని కోరారు.
కార్పొరేషన్ ద్వారా సక్రమంగా అనుమతులు పొందితే ఆదాయం వస్తుందని... అలాంటివారికి నిబంధనల పేరుతో అనుమతి ఆపేస్తున్నారన్నారు. దళారుల ద్వారా అడ్డదారుల్లో దరఖాస్తు చేస్తే అనుమతి ఇచ్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వాణిజ్య ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఎత్తు పెంచి నిర్మాణాలు చేస్తున్నారన్నారు. వార్డు వాలంటీర్లు అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న భవనాలను నిలుపు చేయాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యతను సక్రమంగా ఎందుకు నిర్వర్తించడం లేదో దృష్టి సారించాలని అన్నారు. అవినీతికి సహకరించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ లేఖలో పేర్కొన్నారు.