ఉద్యోగుల ఉద్యమానికి జనసేన మద్దతు: పవన్
ABN , First Publish Date - 2022-02-04T02:38:53+05:30 IST
ఉద్యోగులు చేస్తోన్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు
అమరావతి: ఉద్యోగులు చేస్తోన్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలిచ్చారన్నారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని నమ్మించారన్నారు. జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ చేసిన మోసం వల్లే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారని ఆయన పేర్కొన్నారు. పోరాటానికి రాజకీయ పార్టీల అవసరం లేదని ఉద్యోగులు ప్రకటించారన్నారు. అందువల్లే తాను ఇంతకాలం వీటిపై మాట్లాడలేదని ఆయన తెలిపారు.
ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం బాధాకరమన్నారు. అనేకమందిని అరెస్టు చేసి కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేశారని ఆయన ఆరోపించారు. చర్చల పేరుతో గంటల తరబడి నిరీక్షించేలా చేసి అవమానించారన్నారు. ప్రభుత్వ చర్యలతో ఉద్యోగులను రెచ్చగొట్టేలా చేశారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఉద్యోగులపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పవన్ డిమాండ్ చేశారు.