53 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు

ABN , First Publish Date - 2021-05-18T06:19:49+05:30 IST

ప్రభుత్వ నూతన విధానం ప్రకారం జిల్లాలో 53 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు సక్రమంగా నిర్వహిస్తోన్నట్లు జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదినాథ్‌దాస్‌కి నివేదించారు.

53 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు
సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ నిర్వహించిన వీసీకి హాజరైన జిల్లా అధికారులు

జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌

గుంటూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నూతన విధానం ప్రకారం జిల్లాలో 53 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు సక్రమంగా నిర్వహిస్తోన్నట్లు జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదినాథ్‌దాస్‌కి నివేదించారు. సోమవారం సాయంత్రం విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఇసుక మైనింగ్‌ పాలసీపై సీఎస్‌తో పాటు పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి గోపాలకృష్ణ ద్వివేది, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక రీచ్‌ల వద్ద నెలకొన్న పరిస్థితులను జేసీ వారికి నివేదించారు. జిల్లాలో మొత్తం 53 ఇసుక రీచ్‌ల నిర్వహణని ప్రభుత్వ ఆదేశాల మేరకు జయప్రకాష్‌(జేపీ) వెంచర్స్‌కి కేటాయించామన్నారు. మూడు రీచ్‌లకు సంబంధించి స్థానికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం కాగా రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి వెంటనే పరిష్కరించడం జరిగిందన్నారు. మైనింగ్‌, ఇసుక అధికారులతో రీచ్‌లను పర్యవేక్షిస్తోన్నామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక రీచ్‌లు  పని చేస్తోన్నాయని తెలిపారు. సమావేశంలో మైనింగ్‌ డీడీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇసుక అధికారి పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:19:49+05:30 IST