అనంత రాజకీయాల్లో అద్భుతం.. ఆగర్భ శత్రువుల ఆలింగనం

ABN , First Publish Date - 2021-11-10T21:00:24+05:30 IST

అనంతపురం జిల్లా రాజకీయాల్లో అద్భుతం చోటు చేసుకుంది. జిల్లాలో ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలు ఇప్పుడు ఆప్యాయంగా దగ్గరవుతున్నాయి.

అనంత రాజకీయాల్లో అద్భుతం.. ఆగర్భ శత్రువుల ఆలింగనం

ఇంటర్నెట్ డెస్క్: అనంతపురం జిల్లా రాజకీయాల్లో అద్భుతం చోటు చేసుకుంది. జిల్లాలో ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలు ఇప్పుడు ఆప్యాయంగా దగ్గరవుతున్నాయి. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ కావడం విశేషం. ఒకప్పుడు జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, పరిటాల ఫ్యామిలీ ముందు తెలుగుదేశం పార్టీలో ఉంది. అయితే వైఎస్ మరణానంతరం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జేసీ కుటుంబం కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం కండువా కప్పుకుంది. ఆ సమయంలో పరిటాల కుటుంబం.. జేసీ ఫ్యామిలీ చేరికను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు ఏపీలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి శత్రువైన వైసీపీని దెబ్బతీసేందుకు జేసీ-పరిటాల కుటుంబాలు శత్రుత్వం వదిలి మిత్రులుగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను స్వాగతించేందుకు జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి, పరిటాల కుటుంబం నుంచి శ్రీరామ్ వచ్చారు. అక్కడ ఇద్దరూ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కల్మషం లేకుండా సొంత బిడ్డలా శ్రీరామ్‌ను దగ్గరకు తీసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డి పెద్దరికాన్ని గౌరవించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్ ఆలింగనం చేసుకున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Updated Date - 2021-11-10T21:00:24+05:30 IST