జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇబ్రహీం
ABN , First Publish Date - 2022-04-14T16:36:54+05:30 IST
కాంగ్రెస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జేడీఎస్ తీర్థం పుచ్చుకున్న కేంద్రమాజీ మంత్రి ఇబ్రహీంకు జేడీఎస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని దళపతులు
- 17న అధికారిక ప్రకటన
- పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా హెచ్కే కుమారస్వామి
బెంగళూరు: కాంగ్రెస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జేడీఎస్ తీర్థం పుచ్చుకున్న కేంద్రమాజీ మంత్రి ఇబ్రహీంకు జేడీఎస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని దళపతులు నిర్ణయించారు. రామనగరలో మంగళవారం జరిగిన ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ సూచనప్రాయంగా ఈ విషయం ప్రకటించగా మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి బుధవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హెచ్కే కుమారస్వామికి పార్లమెంటరీ పార్టీ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించనున్నారు. ఈ నెల 17న బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం ఇబ్రహీంను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే సందర్భంగా కాంగ్రె్సకు చెందిన పలువురు మైనార్టీ నేతలు జేడిఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పలువురు సీనియర్ మైనార్టీ నేతలపై జేడీఎస్ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే బెంగళూరు నగరానికి చెందిన మాజీ మంత్రి ఆర్ రోషన్బేగ్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. బేగ్కు ఎమ్మెల్సీ పదవి, ఆయన కుమారుడు రుమేన్ బేగ్కు వచ్చే శాసనసభ ఎన్నికల్లో శివాజీనగర్ టికెట్ ఇచ్చేందుకు జేడీఎస్ అగ్రనేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.