హోం క్వారంటైన్‌లోకి జార్ఖండ్ సీఎం

ABN , First Publish Date - 2020-07-08T20:49:37+05:30 IST

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాంచీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు...

హోం క్వారంటైన్‌లోకి జార్ఖండ్ సీఎం

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాంచీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ఇటీవల తనను కలిసిన ఓ కేబినెట్ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రి మితిలేశ్ ఠాగూర్‌ సీఎం సొరేన్‌తో సమావేశం అయ్యారు. మంత్రికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో గుర్తించడంతో సీఎం అప్రమత్తమయ్యారు. తన కార్యాలయ సిబ్బందిని సైతం హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆదేశించారు.


మంత్రి ఠాగూర్‌తో పాటు ఇటీవల వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురైన జేఎంఎం ఎమ్మెల్యే మధురా మహతో త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించినట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం వీరిద్దరూ రాంచీలోని ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సీఎం నమూనాలను సేకరించి కొవిడ్-19 పరీక్షలకు పంపనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జార్ఖండ్‌లో ఇప్పటి వరకు 3,018 మందికి కరోనా నిర్ధారణ కాగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 892 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-07-08T20:49:37+05:30 IST