తొమ్మిదో తరగతి బాలిక.. 21 ఏళ్ల కుర్రాడు.. పక్కపక్కనే సమాధులు.. ఇద్దరూ ప్రేమికులు కాదు.. కానీ..

ABN , First Publish Date - 2021-12-03T18:14:43+05:30 IST

పద్నాలుగేళ్ల బాలిక సమాధిజ..

తొమ్మిదో తరగతి బాలిక.. 21 ఏళ్ల కుర్రాడు.. పక్కపక్కనే సమాధులు.. ఇద్దరూ ప్రేమికులు కాదు.. కానీ..

ఇంటర్‌నెట్‌డెస్క్: పద్నాలుగేళ్ల బాలిక సమాధి పక్కనే 21ఏళ్ల కుర్రాడి సమాధి కట్టించారు. వాళ్లిద్దరూ ప్రేమికులని.. అందుకే బాలిక సమాధి పక్కనే ఆ యువకుడి సమాధి కట్టించి ఉంటారని అనుకుంటున్నారేమో.. అదేమి కాదు. మరీ ఆ బాలిక సమాధి పక్కనే ఆ యువకుడిని సమాధి చేయడానికి గల కారణాలేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఈ సంఘటన జార్ఖండ్‌లోని గర్హ్వ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


స్థానిక జిల్లాలోని కరివాడిహ్ గ్రామానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఇంతియాజ్ అన్సారీ అనే 21ఏళ్ల కుర్రాడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన ప్రేమను ఒప్పుకోమని ఆ యువకుడు ఆ బాలికను పలుమార్లు కోరాడు. కానీ ఆ బాలిక ససేమిరా అంది. దీంతో ఇంతియాజ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. క్షణికావేశానికి లోనైన ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు.



మంగళవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఆ బాలికతో ఇంతియాజ్ మరోసారి మాట్లాడాడు. తన ప్రేమను ఒప్పుకోవాలని ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ముందే తనతోపాటు తెచ్చుకున్న కత్తితో ఆ బాలికపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలికకు, ఇంతియాజ్‌కు ఇద్దరికీ గాయాలయ్యాయి. కత్తితో పొడిచిన ఆమె చనిపోకపోవడంతో తన దగ్గర ఉన్న పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఆ దెబ్బకు బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. ఇంతియాజ్ పిస్టల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక హత్యకు గురైందన్న విషయం తల్లిదండ్రులకు, పోలీసులకు తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలికను చంపిన వ్యక్తి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. 



పోస్టుమార్టం తర్వాత బాలిక మృతదేహాన్ని బుధవారం ఉదయం తల్లిదండ్రులకు అప్పగించారు. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కచ్చార్వ టోలా స్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ సంఘటన పట్ల తీవ్రంగా భయపడిన ఇంతియాజ్ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడ్స్ రైలు కింద పడి చనిపోయాడు. ఇంతియాజ్ మరణవార్త తెలిసి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం గురువారం అతడి తల్లిదండ్రులకు శవాన్ని అప్పగించారు. అతడి జేబులో ఉన్న రెండు పేజీల సూసైడ్ లెటర్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్‌లో అతడి ప్రేమ గురించి అతడికి ఉన్న అప్పుల గురించి వివరించాడు. అంతేకాదు అతడి శవాన్ని ప్రేమించిన అమ్మాయి సమాధి పక్కనే పూడ్చిపెట్టాలని కోరాడు.


అతడి కోరిక మేరకు ఆ బాలిక సమాధి పక్కన ఇంతియాజ్‌ శవాన్ని పూడ్చిపెట్టడానికి పోలీసులు, అతడి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇంతియాజ్ శవాన్ని తమ కూతురు సమాధి పక్కన ఖననం చేయడానికి వీల్లేదని ఆ బాలిక తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. కానీ పోలీసులు వారిని ఒప్పించి ఆ బాలిక సమాధి పక్కనే ఇంతియాజ్‌ శవాన్ని పూడ్చిపెట్టారు. స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ తన ప్రేమను ఒప్పుకోలేదని ఇంతియాజ్ అనే 21ఏళ్ల కుర్రాడు ఆ బాలికను హత్యచేశాడని, బాలిక చనిపోయిన 24 గంటల్లోనే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అతడి చివరి కోరిక మేరకు ఆ బాలిక సమాధి పక్కనే ఆ యువకుడి శవాన్ని పూడ్చిపెట్టామని చెప్పారు.  



Updated Date - 2021-12-03T18:14:43+05:30 IST