జీవో 10 రద్దు చేయాలి: డీలర్లు
ABN , First Publish Date - 2021-10-27T05:23:32+05:30 IST
రేషన డీలర్లకు గోనెసంచుల కమీషనను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేస్తూ విడుదల చేసిన జీవో 10ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ రాష్ట్ర రేషన డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ కలిముల్లా పేర్కొన్నారు.
ఆత్మకూరు, అక్టోబరు 26: రేషన డీలర్లకు గోనెసంచుల కమీషనను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేస్తూ విడుదల చేసిన జీవో 10ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ రాష్ట్ర రేషన డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ కలిముల్లా పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం పిలుపు మేరకు ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద డీలర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చౌక దుకాణాలకు వచ్చే సరుకుల గోనెసంచులను రేషనడీలర్లు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలనే జీవోనెం.10ను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు మండలాల రేషనడీలర్లు బాబు, గరికరమణ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, భూషణం, శ్రీనివాసరెడ్డి, హరి, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: జీవో నంబర్ 10ని రద్దు చేయాలని కోవెలకుంట్ల పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాము వద్ద డీలర్ల సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి, వల్లంపాడు జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సివిల్ సప్లయ్ గోదాము వద్ద డీలర్లు ధర్నా నిర్వహించారు. సివిల్ సప్లయ్ గోదాము పరిధిలోని ఉయ్యాలవాడ, దొర్నిపాడు, సంజామల, కోవెలకుంట్ల మండలాలకు చెందిన డీలర్లు కోవెలకుంట్లకు చేరుకొని సివిల్ సప్లయ్ గోదాము వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం ఖాళీ గోనె సంచులను తిరిగి ఇవ్వాలనే నిబంధన పెట్టిందన్నారు. జీవో నంబర్ 10 వల్ల డీలర్లకు అన్యాయం జరుగుతుందని, వెంటనే దీ న్ని రద్దు చేయాలని కోరారు.
నందికొట్కూరు రూరల్: రేషన డీలర్లకు నష్టం కలిగించే జీఓ నెంబర్ 10ని తక్షణమే రద్దు చేయాలని నందికొట్కూరు సివిల్ సప్లై గోదాం వద్ద డీలర్లు ధర్నా నిర్వహించారు. మంగళవారం నందికొట్కూరు నియోజకవర్గ రేషన డీలర్లు, వారి నాయకులు, వారికి మద్దతుగా సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం నాయకులు చాంద్బాషా, వలి, తిరుపాలు మాట్లాడుతూ గోనె సంచులకు సంబంధించిన జీఓ నెంబర్ 10ని తక్షణమే తొలగించాలని, కరోనా కాలంలో పంపిణీ చేసిన 8 నెలల కందిపప్పు, శనగల కమీషన ఇవ్వాలని అన్నారు. సీపీయం జిల్లా నాయకుడు ఎం నాగేశ్వరారావ్, సీఐటీయూ జిల్లా నాయకులు భాస్కరెడ్డి, పక్కీర్సాహెబ్, సీపీఐ జిల్లా నాయకులు రఘురాంమూర్తి, రమే్ష పాల్గొన్నారు.