ఉద్యోగాల కోసం 75 లక్షల మంది ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-02-16T14:35:41+05:30 IST

రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగుల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. రాష్ట్రంలో 75 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వ గణాంకాలు

ఉద్యోగాల కోసం 75 లక్షల మంది ఎదురుచూపు

చెన్నై: రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగుల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. రాష్ట్రంలో 75 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వ గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి వరకూ ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకున్నవారి సంఖ్య 75 లక్షలు దాటిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 18 ఏళ్లలోపు పాఠశాలల విద్యార్థులు 17.81 లక్షల మంది ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇదే విధంగా 19 నుంచి 23 ఏళ్లలోపు వారు 16.14 లక్షల మందిదాకా ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.  24 నుంచి 35 ఏళ్లలోపు వారు అదీ డిగ్రీలు, పీజీలు మంచి మార్కులతో ఉత్తీర్ణులైనవారు సహా మొత్తం 28.60 లక్షల మందిదాకా ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. 36 నుంచి 57 ఏళ్లలోపు వారు 13.20 లక్షల మంది కూడా ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని ఇంకా ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు పెట్టుకుని మరీ జీవిస్తున్నారు. ఇక దివ్యాంగులైన నిరుద్యోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. కాళ్లు, చేతులు లోపంతో ఉన్న 71,566 మంది ఉపాధి కల్పనా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకుని ఏటా రెన్యూవల్‌ చేసుకుంటూ నిరాశతో గడుపుతున్నారు. అంధత్వం కలిగిన 17,094 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తమ బతుకుల్లో దీపాలు వెలుగుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. చెవిటి, మూగ వంటి దివ్యాంగులు 9457 మంది ఏళ్ల తరబడి ఉపాధి కల్పనా కేంద్రాల నుంచి ఉద్యోగాల కోసం కాల్‌ లెటర్స్‌ వస్తాయని ఆశపెట్టుకుని జీవిస్తున్నారు. ఇక పట్టభద్రులైన ఉపాధ్యాయులు 3.57 లక్షల మందిదాకా ఉన్నారు. వీరికి కనీసం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కానీ, రోజువారీ వేతన పద్ధతిలో గానీ ఉద్యోగాలు కానీ లభించటం లేదు. నిరుద్యోగుల సంఖ్య ఇంత స్థాయిలో ఉండడం పట్ల డీఎంకే ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. 

Updated Date - 2022-02-16T14:35:41+05:30 IST