బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం.. భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట!
ABN , First Publish Date - 2021-03-13T17:41:58+05:30 IST
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీయులకు బైడెన్ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీయులకు బైడెన్ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వీసాలకు సంబంధించి విదేశీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ యంత్రాంగం శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించనుంది. నాన్-ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలు ముఖ్యంగా హెచ్-1బీ వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన మూడు ఆదేశాలతో విదేశీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది.
ఈ మేరకు ఫామ్ ఐ-129కి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఆ మూడు విధానాలతో ఇబ్బందులు పడుతున్న వారు వాటిపై యూఎస్సీఐఎస్కు తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని పేర్కొంది. ఇక బైడెన్ పాలనావిభాగం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రంప్ హయాం నుంచి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఉపశమనం లభించిందని చెప్పాలి.