టైమ్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా బైడెన్, కమల..

ABN , First Publish Date - 2020-12-11T16:34:44+05:30 IST

ప్రముఖ టైమ్ మ్యాగ్జైన్ ఈ ఏడాది 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌లను ఎంపిక చేసింది.

టైమ్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా బైడెన్, కమల..

న్యూయార్క్: ప్రముఖ టైమ్ మ్యాగ్జైన్ ఈ ఏడాది 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌లను ఎంపిక చేసింది. టైమ్ తన కవర్ పేజీపై బైడెన్(78), హ్యారిస్(56) ఫొటోలను 'చేంజింగ్ అమెరికాస్ స్టోరీ' పేరిట ముద్రించనుంది. ఈ మేరకు టైమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఫైనలిస్ట్‌గా నిలిచిన అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లను దాటి బైడెన్, కమల ఈసారి టైమ్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా నిలవడం విశేషం. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 


ట్రంప్ కంటే బైడెన్‌కు దాదాపు 7 మిలియన్ల ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో బైడెన్‌ 306 ఎలక్టోరల్ ఓట్లతో అగ్రరాజ్యం తదుపరి అధ్యక్షుడు అయ్యారు. ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్ల వద్దే ఆగిపోయారు. అటు కమల అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ఇద్దరిని టైమ్ ఈ ఏడాది 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా ఎంచుకుంది. కాగా, టైమ్ మ్యాగ్జైన్ 1927 నుంచి ప్రతియేటా.. ఆ ఏడాది ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తిని లేదా వ్యక్తులను తన కవర్ పేజీపై చోటు కల్పిస్తూ గౌరవిస్తుంది. గతేడాది టీనేజ్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌కు ఈ గౌరవం దక్కింది. అలాగే 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. టైమ్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా నిలిచిన విషయం తెలిసిందే. 




Updated Date - 2020-12-11T16:34:44+05:30 IST