వ్యాక్సినేషన్పై బైడెన్ కీలక ప్రకటన !
ABN , First Publish Date - 2021-04-07T14:16:24+05:30 IST
వ్యాక్సినేషన్ విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వైట్హౌస్ మీడియా వర్గం వెల్లడించింది.
వాషింగ్టన్: వ్యాక్సినేషన్ విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19 నుంచి అమెరికాలోని వయోజనులందరూ టీకా తీసుకోవడానికి అర్హులని ప్రకటించారు. కనుక వీలైనంత త్వరగా సాధ్యమైనంత ఎక్కువ మంది తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు తీసుకోవాలని ఈ సందర్భంగా అమెరికన్లకు బైడెన్ కోరారు. ఏప్రిల్ 19 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరూ తప్పకుండా టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 'మన దగ్గర వ్యాక్సినేషన్ ప్రక్రియ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. చాలా సులువుగా టీకా దొరుకుతోంది. 150 మిలియన్ మోతాదుల టీకాల మార్క్ను అందుకున్న తొలి దేశం మనదే. అలాగే 62 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన మొదటి దేశం కూడా మనదే.' అని బైడెన్ అన్నారు. దేశంలోని 50 రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేంగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఇంతకుముందు మే 1 నుంచి దేశవ్యాప్తంగా వయోజనులందరకీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా ఈ గడువును ముందుకు జరిపి.. ఏప్రిల్ 19కు మార్చినట్లు అధ్యక్షుడు తెలియజేశారు.
ఇక ఇటీవల బైడెన్ వ్యాక్సినేష్ విషయంలో తన లక్ష్యాన్ని రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. మొదట తన 100 రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని 56 రోజుల వ్యవధిలోనే అందుకున్నారు. దీంతో ఇదే 100 రోజుల్లో 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందివ్వాలనే లక్ష్యంతో బైడెన్ ఉన్నారు. సోమవారం వైట్హౌస్ సీనియర్ కరోనా సలహాదారు ఆండీ స్లావిట్ మాట్లాడుతూ ప్రస్తుతం రోజువారీ డోసుల సంఖ్య 3.1 మిలియన్లకు చేరిందని ప్రకటించారు. మంగళవారంతో 75 రోజుల్లోనే అగ్రరాజ్యం ఏకంగా 150 మిలియన్ మోతాదుల మార్క్ను అందుకుందని ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 5.56 లక్షల మంది కరోనా బలయ్యారు.