ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-01-18T02:43:59+05:30 IST

ఐపీఎల్ మెగా వేలం నుంచి తప్పుకుంటున్నట్టు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ చేసిన ప్రకటన

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలం నుంచి తప్పుకుంటున్నట్టు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ చేసిన ప్రకటన ఐపీఎల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన జో రూట్ ఇప్పుడు ఈ అకస్మాత్తు నిర్ణయం వెనక పెద్ద కథే ఉంది.


యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 0-4 తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలోనే రూట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కోసం చేయాల్సింది చాలానే ఉందన్న రూట్.. అందుకోసం తాను చేయగలిన త్యాగం ఐపీఎల్ నుంచి తప్పుకోవడమేనని పేర్కొన్నాడు. 


రూట్ తొలిసారి 2018 ఐపీఎల్ సీజన్‌లో వేలానికి తన పేరు ఇచ్చినప్పటికీ అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. దీంతో ఈసారైనా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అయితే, యాషెస్‌లో ఘోర పరాభవం అతడిని నిర్ణయం మార్చుకునేలా చేసింది. మరోవైపు రూట్ డిప్యూటీ బెన్ స్టోక్స్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. యాషెస్ ఓటమి భారం వేధిస్తుండడంతో ఈసారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 


ఈ ఆల్‌రౌండర్ నాలుగు సీజన్లలో ఐపీఎల్‌లో ఆడాడు. 2017లో అప్పటి రైజింగ్ పూణె సూపర్‌ జియంట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. గాయం కారణంగా గత సీజన్‌ నుంచి తప్పుకోవడంతో రాయల్స్ అతడిని రిలీజ్ చేసింది. ఈసారి ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లకు అదిరిపోయే ధర పలుకుతుందని భావిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మెగా వేలం జరగనుంది. 

Updated Date - 2022-01-18T02:43:59+05:30 IST