మరో స్వాతంత్ర్య పోరాటానికి యువత కదలిరండి: నానా పటోలే
ABN , First Publish Date - 2021-08-01T23:30:31+05:30 IST
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి యువత ముందుకు రావాలని..
పుణె: కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి యువత ముందుకు రావాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కోరారు. దీనిని సరికొత్త 'స్వాతంత్ర్య పోరాటం'గా ఆయన అభివర్ణించారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల స్వేచ్ఛను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడలాక్కుందని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎప్పుడూ పాలుపంచుకున్న చరిత్ర బీజేపీకి లేదన్నారు.
''తిలక్ రచనలు చేసినప్పుడు ఆయనపై బ్రిటిష్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. మీడియా సంస్థలను మోదీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. మళ్లీ మన స్వాతంత్ర్యం కోసం మరోసారి పోరాడాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం కోసం కేంద్రంతో జరిపే ఈ సరికొత్త పోరాటానికి కాంగ్రెస్తో చేతులు కలపాలని ఈ దేశ యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను'' అని నానా పటోలే అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిపై కూడా పటోలే విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి శాంతిదూతగా ప్రపంచ గుర్తింపు పొందాలనే కోరిక జవహర్లాల్ నెహ్రూకు ఉండేదంటూ కోషియారి ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గవర్నర్గా ఇలాంటి రాజకీయాలకు ఆయన పాల్పడకూడదని, రాజ్భవన్ ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యాలయంగా మారిందని ఎద్దేవా చేశారు.