ఈయనో అధికారి.. ఎవరో తెలుసా?!
ABN , First Publish Date - 2020-04-01T08:26:04+05:30 IST
అది విజయనగరం రాజీవ్ క్రీడా మైదానం. అందులో రైతు బజార్. సమయం మంగళవారం ఉదయం 9 గంటలు.. లుంగీ, బనియన్, భుజంపై టవల్తో సాదాసీదాగా ఉన్న ఓ వ్యక్తి కూరగాయల...
అది విజయనగరం రాజీవ్ క్రీడా మైదానం. అందులో రైతు బజార్. సమయం మంగళవారం ఉదయం 9 గంటలు.. లుంగీ, బనియన్, భుజంపై టవల్తో సాదాసీదాగా ఉన్న ఓ వ్యక్తి కూరగాయల కొనుగోలుకు వచ్చారు. కరోనా నేపథ్యంలో దూరదూరంగా గీసిన గళ్ల వద్ద నిలబడి ఒక్కో స్టాల్ వద్దకు వెళ్లి ధరల పట్టిక ఉందో లేదో.. ఎగా దిగా చూశారు. ఆఖరికి కొన్ని కూరగాయలు కొనుక్కుని బయటకు వచ్చారు. ఎవరీయన ఆరా తీసిన విలేకరులు.. జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ అని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఇదేంటి సార్.. ఇలా వచ్చారు అని ప్రశ్నిస్తే.. ‘కరోనా నేపథ్యంలో రైతు బజార్లో కూడా అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే సాధారణ వ్యక్తిలా వచ్చి పరిశీలించాను. ఒకటి రెండు కూరగాయల ధరల విషయంలో స్వల్ప తేడాలున్నా.. బోర్డులపై ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు భౌతిక దూరాన్ని పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాను.. పర్లేదు’ అని సంతృప్తి వ్యక్తంచేస్తూ కూరగాయల బ్యాగు పట్టుకుని.. వెళ్లిపోయారు!. - విజయనగరం