నల్లగొండ జిల్లా జైలుకు జర్నలిస్ట్ రఘు..
ABN , First Publish Date - 2021-06-06T12:43:07+05:30 IST
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన
హైదరాబాద్/హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన భూముల కేసుల విషయంలో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన టీవీ జర్నలిస్ట్ రఘును నల్లగొండ జిల్లా జైలుకు శనివారం తరలించారు. ఉదయం వరకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్జైలులో ఉన్న రఘును పోలీసులు జిల్లా జైలుకు తరలించడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో అరెస్ట్ అయిన అతన్ని హుజూర్నగర్ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని పట్టణంలోని సబ్ జైలుకు తరలించారు. సీఎం కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తూ జర్నలిస్టు రఘు సబ్జైలు నుంచి ప్రధానమంత్రికి లేఖ రాశారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అతన్ని హుజూర్నగర్ నుంచి నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు తెలిసింది. భద్రతా కారణాల దృష్ట్యా రఘును జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
మరోకేసు...
టీవీ రిపోర్టర్ రఘుపై మఠంపల్లి పోలీ్సస్టేషన్లో మరో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం జర్నలిస్టు రఘు ఓ టీవీ వేదికగా హుజూర్నగర్ ఎమ్మెల్యేను దూషించారని ఆరోపిస్తూ మఠంపల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు అప్పట్లో ఫిర్యాదు చేయగా అప్పుడే కేసు నమోదు చేసినట్లు హుజూర్నగర్ సీఐ రాఘవరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నట్లు తెలిపారు. గుర్రంబోడుతండా ఘటన, ఎమ్మెల్యేను దూషించిన ఘటనను కలుపుకొని రఘుపై మఠంపల్లి పోలీ్సస్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయని సీఐ వెల్లడించారు.