కూతుళ్ల ముందే జర్నలిస్టుపై కాల్పులు.. సీసీటీవీకి చిక్కిన దారుణ దృశ్యాలు!

ABN , First Publish Date - 2020-07-21T18:36:43+05:30 IST

కూతుళ్లతో బైక్‌పై వెళుతున్న ఓ జర్నలిస్టుపై దుండగులు కాల్పులకు తెబడ్డారు.

కూతుళ్ల ముందే జర్నలిస్టుపై కాల్పులు.. సీసీటీవీకి చిక్కిన దారుణ దృశ్యాలు!

ఘాజియాబాద్: కూతుళ్లతో బైక్‌పై వెళుతున్న ఓ జర్నలిస్టుపై  దుండగులు కాల్పులకు తెబడ్డారు. న్యూఢిల్లీకి సమీపంలోని ఘాజియాబాద్‌లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితుడిని విక్రమ్ జోషీగా పోలీసులు గుర్తించారు. తలకు బుల్లెట్ గాయం కావడంతో విక్రమ్ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడితో సహా ఐదుగురు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.


ఈ హత్యాయత్నం తాలూకు భీతి గొలిపే దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. దుండుగలు ఒక్కసారిగా అడ్డురావడంతో తత్తరపడిన విక్రమ్ బైక్‌పై నుంచి పడినట్టు సీసీటీవీలో రికార్డైంది. ఆ తరువాత వెంటనే అతడికి చుట్టుముట్టిన ముష్కరులు అతడిపై దాడికి దిగారు. దీంతో భయాందోళనలకు లోనైన విక్రమ్ కుమార్తెలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలోనే దుండగులు జర్నలిస్టుపై కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపుమడుగులో పడి ఉన్న తండ్రిని చూసి బోరుల విలపిస్తున్న కూతుళ్లు దారిన పోయే వారిని సహాయం చేయాలంటూ అర్థించడం సీసీటీవీకి చిక్కింది. ప్రస్తతుం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. తన మేనకోడలికి వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఇటీవల విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై హత్యయత్నం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-07-21T18:36:43+05:30 IST