'జీతేగా పంజాబ్' మిషన్ కలలు సాకారం చేస్తా: సిద్ధూ

ABN , First Publish Date - 2021-07-19T21:33:31+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన యాత్ర ఇప్పుడే మొదలైందని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్..

'జీతేగా పంజాబ్' మిషన్ కలలు సాకారం చేస్తా: సిద్ధూ

ఛండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన యాత్ర ఇప్పుడే మొదలైందని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా పదోన్నతి పొందిన అనంతరం ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడారు. పార్టీకి కట్టుబడిన కార్యకర్తగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని, జీతేగా పంజాబ్ (పంజాబ్‌ను గెలిపిస్తాం) మిషన్ కలల సాకారానికి కాంగ్రెస్ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు. తనపై విశ్వాస ముంచి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధూ నియామకాన్ని సోనియాగాంధీ ఆదివారంనాడు ఆమోదించారు. తక్షణం ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. తన నియామకం జరిగిన వెంటనే సిద్ధూ పాటియాలాలోని గురుద్వారా శ్రీ దుఃఖనివారణ్ సాహిబ్ ‌వద్ద ప్రార్థనలు జరిపారు. హరిషా రావత్, సునీల్ జాఖడ్‌, పంజాబ్ మంత్రి త్రిపట్ రాజేందర్ సింగ్ భజ్వా తదితర కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు.


సిద్ధూకు పదోన్నతిని స్వాగతించిన కాంగ్రెస్ నేతలు

కాగా, సిద్ధూకు కొత్త బాధ్యతలు అప్పగించడాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. సిద్ధూను మఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభినందించారా అని పార్టీ ఎమ్మెల్యే నిర్మల్ సింగ్‌ను అడిగినప్పుడు, ఉండవచ్చని, అధిష్ఠానం ఏమి నిర్ణయించినా అధి 100 శాతం సరైనదేనని అన్నారు. ఎవరికీ మనస్తాపం లేదని, అంతా సజావుగానే ఉందని పేర్కొన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్జే మాట్లాడుతూ, అధిష్ఠానం ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటుందని, సిద్ధూ యువకుడే కాకుండా, చురుకైన పార్లమెంటరేయన్ అని, ఆయనలో ఉన్న పనిచేయాలనే పట్టుదలను స్వాగతించాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కలిసి పనిచేసే విషయంలో పార్టీకి సిద్ధూ ఒక ఎస్సెట్ (ఆస్తి) అవుతాడని, ఇద్దరూ కలిసి పార్టీని విజయతీరాలకు చేరుస్తారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశ్వని కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-19T21:33:31+05:30 IST