కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకలించే వరకు విశ్రమించబోం: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2022-01-04T16:42:30+05:30 IST

బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకలించే వరకు విశ్రమించబోం: జేపీ నడ్డా

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు బీజేపీ భయపడబోదని తెలిపారు. పూర్తి శక్తితో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపట్ల బీజేపీ కార్యకర్తలు పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు. తెలంగాణ నుంచి అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకలించే వరకు విశ్రమించబోమన్నారు. తెలంగాణలో చీకటి రాజ్యం సాగుతోందన్న సంకేతాలను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లేలా మంగళవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కనీసం 10వేల మంది పాల్గొనేలా ప్లాన్ చేసింది. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


కాగా బండి సంజయ్ అరెస్టును జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. సోమవారం నాటి పరిణామాలతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సంజయ్‌కు సంఘీభావంగా ఏయే కార్యక్రమాలు చేయాలో జాతీయ నాయకత్వమే రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బండి సంజయ్‌కు కరీంనగర్ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను జిల్లా జైలుకు తలించారు. 

Updated Date - 2022-01-04T16:42:30+05:30 IST