వరద నీటిలో జేపీ ఆపరేటర్లు
ABN , First Publish Date - 2021-07-13T15:02:47+05:30 IST
ఆళ్లూరుపాడు మునేటి రీచ్లో..
పోలీసుల చొరవతో సురక్షితంగా ఒడ్డుకు
వత్సవాయి: ఆళ్లూరుపాడు మునేటి రీచ్లో ఇసుక తీసేందుకు వెళ్లిన నలుగురు ఇతర రాష్ట్రాల కార్మికులు వరదనీటిలో చిక్కుకోగా పోలీసుల చొరవతో ఒడ్డుకు చేరుకున్నారు. రెండు వారాల క్రితం జేపీ సంస్థ ఆళ్లూరుపాడు ఇసుక రీచ్లో తవ్వకాలు ప్రారంభించింది. బీహార్, యూపీ, ఒడిసాలకు చెందిన మిషన్ ఆపరేటర్లతో సోమవారం ఉదయం ఇసుక తీస్తుండగా తెలంగాణాలో ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వచ్చిన వరదనీటిలో ఆపరేటర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్, వత్సవాయి ఎస్సై మహాలక్ష్ముడులు వెంటనే గత ఈతగాళ్లు, నాటు పడవలను, ఫైరింజన్ను తెప్పించి వరదలో చిక్కుకున్న రఘువీర్, రాంప్రసాద్, ఇస్మాయిల్ అన్సారీ, మనోజ్లను ఒడ్డుకు తీసుకువచ్చారు. సకాలంలో పోలీసులు స్పందించటం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని ఆపరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.