జూడాల నిరసన
ABN , First Publish Date - 2021-12-02T06:43:49+05:30 IST
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లు బుధవారం నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు.
విజయవాడ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లు బుధవారం నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న స్టైఫండ్స్పై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ టు సర్వీస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ పీజీ కౌన్సెలింగ్ని సుప్రీంకోర్టు వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ జూడాలు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జీజీహెచ్లోని జూనియర్ డాక్టర్లు బుధవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. గురువారం సిద్ధార్థ మెడికల్ కాలేజీ వద్ద కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలపనున్నట్లు జూడాలు తెలిపారు. మూడో తేదీన జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేస్తామని, నాలుగున మాస్ మెయిలింగ్ ద్వారా సోషల్ మీడియాలో ‘ట్విట్టర్ తుఫాన్’ పేరుతో నిరసన వ్యక్తం చేస్తామని, ఐదో తేదీ నుంచి ఆసుపత్రిలో ఏపీడీ సేవలను నిలిపివేస్తామని, ఏడో తేదీ నుంచి ఇన్పేషెంట్లకు వైద్యసేవలను, తొమ్మిదో తేదీ నుంచి అత్యవసర వైద్యసేవలను కూడా బహిష్కరించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు వివరించారు.