AP Assembly ఘటన కలచివేసింది: జూనియర్ ఎన్టీఆర్
ABN , First Publish Date - 2021-11-20T21:46:40+05:30 IST
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు.
హైదరాబాద్: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. తన మనోభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. నిన్న శాసనసభలో జరిగిన ఘటన కలచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయమని, మన సంప్రదాయాలను రాబోయే తరానికి అందివ్వాలన్నారు. ఈ మాటలు వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబసభ్యుడిగా మాట్లాడడం లేదన్నారు. నేనొక కొడుకుగా, తండ్రిగా మాట్లాడుతున్నానన్నారు. మన సంస్కృతిని కాల్చివేసేలా వ్యవహరించకూడదన్నారు. ఈ అరాచక సంస్కృతిని ఇంతటితో ఆపాలని పిలుపునిస్తూ రాజకీయ నాయకులకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.