సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్‌కు కోవిడ్-19 పాజిటివ్

ABN , First Publish Date - 2021-05-13T01:33:06+05:30 IST

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్‌కు కోవిడ్

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్‌కు కోవిడ్-19 పాజిటివ్

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు అత్యున్నత న్యాయస్థానం పరిపాలక విభాగం బుధవారం వెల్లడించింది. కోవిడ్-19 రెండో ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంసిద్ధతకు సంబంధించి స్వీయ విచారణ జరుపుతున్న ధర్మాసనానికి ఆయన నేతృత్వంవహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ గురువారం జరగవలసి ఉంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఉన్నారు. 


జస్టిస్ చంద్రచూడ్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఈ స్వీయ విచారణ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు ఈ విచారణను చేపడతారో, లేదో స్పష్టంగా తెలియదు. మరొక సీనియర్ జడ్జి ధర్మాసనానికి ఈ విచారణను అప్పగించే అధికారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు ఉంది. మరోవైపు ఈద్‌ను గురువారం జరుపుకోవలసి వస్తే, న్యాయస్థానానికి సెలవు ప్రకటిస్తారు. గురువారం విచారణ జరపవలసిన కేసులన్నిటినీ శుక్రవారానికి వాయిదా వేస్తారని తెలుస్తోంది. 


రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను కట్టుదిట్టంగా సరఫరా చేయడం కోసం శాస్త్రీయ అధ్యయనం, సిఫారసులు చేయాలని ఆదేశిస్తూ ఓ నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-05-13T01:33:06+05:30 IST