ప్రధాని భద్రతా వైఫల్యంపై జస్టిస్ ఇందూ మల్హోత్రా కమిటీ
ABN , First Publish Date - 2022-01-13T07:19:46+05:30 IST
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది.
- వైఫల్యాలు తలెత్తకుండా మార్గదర్శకాలు అవసరం: సీజేఐ ఎన్వీ రమణ
- ఏకపక్ష దర్యాప్తునకు వీల్లేకుండా నిష్ణాతులకు బాధ్యతలు
- సాధ్యమైనంత త్వరగా కమిటీ నివేదికను అందిస్తుంది
- భద్రతా వైఫల్యాలు తలెత్తకుండా మార్గదర్శకాలు అవసరం
- స్పష్టం చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ
న్యూఢిల్లీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అడిషనల్ డీజీపీ(సెక్యూరిటీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏకపక్ష దర్యాప్తునకు ఏ మాత్రం వీలు కల్పించకుండా ఉండేందుకే న్యాయపరంగా నిష్ణాతులైన వారికి దర్యాప్తును అప్పజెప్పాలని నిర్ణయించామని జస్టిస్ రమణ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను కమిటీకి స్వాధీనం చేయాలని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ను ధర్మాసనం ఆదేశించింది.
ప్రధాని పర్యటన వేళ జరిగిన భద్రతా వైఫల్యానికి కారణాలేమిటి? దీనికి ఎవరు, ఎంతవరకు బాధ్యులు? ప్రధాని, ఇతర రాజ్యాంగ హోదాల్లో ఉన్నవారికి భద్రతా చర్యలు ఏ విధంగా ఉండాలి? తదితర అంశాలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని జస్టిస్ రమణ తెలిపారు. కీలక వ్యక్తుల భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొత్త మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎవరీ జస్టిస్ ఇందూ మల్హోత్రా?
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మహిళ జస్టిస్ ఇందూ మల్హోత్రా. 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు సుప్రీం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఇందూ మల్హోత్రా... అనేక రంగాల్లో న్యాయ నిష్ణాతురాలిగా పేరు పొందారు. 1983 నుంచి 35 సంవత్సరాలపాటు న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. శబరిమల వివాదం, స్వలింగ సంపర్కం, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్పై లైంగిక ఆరోపణలు తదితర అంశాలకు సంబంధించిన కేసుల విచారణలో జస్టిస్ మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.