మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2021-12-01T06:46:19+05:30 IST
విద్యుదాఘాతంతో మృతి చెందిన విద్యుత్ కార్మికుడు రెక్కల సురేష్(26) కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన సుందర్ డిమాండ్ చేశారు.
తుంగతుర్తి, నవంబరు 30: విద్యుదాఘాతంతో మృతి చెందిన విద్యుత్ కార్మికుడు రెక్కల సురేష్(26) కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞాన సుందర్ డిమాండ్ చేశారు. దేవునిగుట్ట తండాలో విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతంతో మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన సురేష్ మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా తుంగతుర్తిలోని విద్యుత్ కార్యాలయం ఎదుట సురేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మంగళవారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో జ్ఞాన సుందర్ మాట్లాడారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో సురేష్ మృతి చెందాడన్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందజేయా లన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారుల సస్పెండ్ చేయాలన్నారు. ధర్నా చేస్తున్న ప్రదేశానికి పోలీసులు, విద్యుత్ అధికారులు చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.