జస్టిస్‌ రమణ యాదాద్రి పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2021-06-14T09:13:57+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ యాదాద్రి సందర్శనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తన తండ్రి తిథి సోమవారం ఉండటంతో ఆ ఆలయ

జస్టిస్‌ రమణ యాదాద్రి పర్యటన వాయిదా

రేపు లేదా ఎల్లుండి ఆ క్షేత్ర సందర్శన

సీజేఐకి పలువురి శుభాకాంక్షలు


హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ యాదాద్రి సందర్శనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తన తండ్రి తిథి సోమవారం ఉండటంతో ఆ ఆలయ సందర్శనను ఆయన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం లేదా బుధవారం ఆయన యాదాద్రికి వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు విచ్చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణను యదాద్రి ఆలయ సందర్శనకు సీఎం కేసీఆర్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని తప్పక దర్శిస్తానని సీజేఐ ఆయనకు తెలిపారు. ఈ మేరకు ఆయన పర్యటన సోమవారం ఉండొచ్చని అధికారవర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.


కానీ, అది మంగళవారానికి వాయిదా పడినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కాగా.. జస్టిస్‌ రమణ రాక సందర్భంగా ఆయన హోదాకు తగినట్టుగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు ఉండాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి.. శనివారమే (12న) కొండపై ఏర్పాట్లను పరిశీలించారు. సీజేఐ వెంట యాదాద్రి ఆలయ సందర్శనకు రాష్ట్ర హైకోర్టు సీజే జస్టిస్‌ హిమ కోహ్లి, ఇతర న్యాయమూర్తులు, జిల్లా మంత్రి, అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, రాజ్‌భవన్‌లో బస చేసిన సీజేఐ జస్టిస్‌ రమణను ఆదివారం పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-06-14T09:13:57+05:30 IST