భారత్ హెచ్చరిక లెక్క చేయక.. రైతులకు మళ్లీ మద్దతిచ్చిన కెనడా ప్రధాని

ABN , First Publish Date - 2020-12-05T22:44:28+05:30 IST

ఇండియాలో రైతులు నిరసన చేస్తున్నారన్న వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబ సభ్యుల గురించే శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తుచేయాలనుకుంటున్నాను

భారత్ హెచ్చరిక లెక్క చేయక.. రైతులకు మళ్లీ మద్దతిచ్చిన కెనడా ప్రధాని

టొరంటో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలకు మద్దతు ఇచ్చి రాజకీయంగా పెద్ద దుమారం లేపారు కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో. దీనిపై ఇండియాలో గట్టి వ్యతిరేకతనే ఎదురైంది. అయితే, రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్టు మరోసారి స్పష్టం చేసి మరింత కాక రేకెత్తించారు. ఇండియా హెచ్చరికలను బేకాతరు చేస్తూ రైతు నిరసనకు ట్రూడో మద్దతు ఇవ్వడం పట్ల ఇండియా ఏ రీతిలో స్పందించనుందో చూడాలి. రైతులకు మద్దతుపై ఇండియాలో ఆయనపై వస్తున్న వ్యతిరేకతను ఓ జర్నలిస్టు ప్రస్తావించగా.. శాంతియుతంగా నిరసన ప్రపంచంలో ఎక్కడ జరిగినా కెనడా మద్దతు ఇస్తుందంటూ సమాధానం ఇచ్చారు.


‘‘ఇండియాలో రైతుల నిరసనకు మీరు మద్దతు తెలపడం పట్ల ఇండియా నుంచి మీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై మీ సమాధానం ఏంటి?’’ ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ‘‘ప్రపంచంలో ఏ మూలన శాంతియుత నిరసన జరిగినా దానికి కెనడా మద్దతు తెలుపుతుంది. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము’’ అని ట్రూడో సమాధానం ఇచ్చారు. దీనికి కొద్ది రోజుల ముందు ఇండియాలో జరుగుతున్న నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


‘‘ఇండియాలో రైతులు నిరసన చేస్తున్నారన్న వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబ సభ్యుల గురించే శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తుచేయాలనుకుంటున్నాను. మేము చర్చల ప్రముఖ్యతను విశ్వసిస్తాం. మా ఆందోళనను ఇండియన్ అధికారుల ముందు వ్యక్తం చేశాం. మనందరిని ఒక దగ్గర కలిపి ఉంచే క్షణం ఇది’’ అని ట్రూడో అన్నారు. దీనిపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇండియాలోని కెనడా అంబాసిడర్‌కు సమన్లు జారీ చేసింది.

Updated Date - 2020-12-05T22:44:28+05:30 IST